Telangana
oi-Dr Veena Srinivas
హైదరాబాద్ కు నెట్ ఫ్లిక్స్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లేనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ కు చెందిన ఐలైన్ స్టూడియోస్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ లో నెట్ ఫ్లిక్స్ ప్రారంభం.. శుభ పరిణామం అన్న సీఎం
హెచ్ఐసీసీ లో జరిగిన ఈ కార్యక్రమానికి ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు, సినీ నటుడు రానా దగ్గుబాటి, నెట్ ఫ్లిక్స్ ఐల్యాండ్ సీఈఓ జెఫ్ షాపిరో, తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు తదితరులు హాజరయ్యారు.ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ….. నెట్ ఫిక్స్ కెంపెనీ హైదరాబాద్ లో కార్యాలయం ప్రారంభించడం శుభ పరిణామం అన్నారు.
నెట్ ఫ్లిక్స్ ఐ లైన్ స్టూడియో విస్తరణకు తమ వంతు సహకారం
హాలీవుడ్ కు చెందిన ఇతర సినీమా ప్రొడక్షన్ హౌస్ లు హైదరాబాద్ లో తమ కార్యకలాపాలు ప్రారంభిస్తాయని ఆశించారు. నెట్ ఫ్లిక్స్ తో తన కల నిజం కాబోతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నెట్ ఫ్లిక్స్ ఐ లైన్ స్టూడియో విస్తరణకు ప్రభుత్వం నుండి తమ వంతు సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.
ఫ్యూచర్ సిటీలో నెట్ ఫ్లిక్స్ విస్తరణకు కావాల్సిన భూమి ఇస్తాం
ఫోర్త్ సిటీని నిర్మిస్తున్నామని పేర్కొన్న సీఎం రేవంత్ నెట్ఫ్లిక్స్ విస్తరణకు కావాల్సిన భూమిని ఫ్యూచర్ సిటీలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. తనకు సినిమాల పైన ఆసక్తి ఉందని పేర్కొన్న ఆయన తన బాల్యం నుంచి ఇప్పటివరకు చిత్ర రంగంలో అనేక మార్పులు వచ్చాయన్నారు. ఇటీవల అత్యున్నత సాంకేతికతతో కూడిన బాహుబలి, కల్కి, ఆర్ఆర్ఆర్, అరుంధతి వంటి సినిమాలను ప్రస్తావించారు.
తమ దృష్టి మొదటినుండి హాలీవుడ్ పైనే ఉందన్న సీఎం రేవంత్
చెన్నైలో ఉన్న తెలుగు సినిమా రంగాన్ని ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి హైదరాబాద్ కు తీసుకువచ్చారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ కేంద్రంగా హాలీవుడ్ తరహా చిత్రాలు నిర్మాణం కావాలని ఆకాంక్షించారు. తమ దృష్టి మొదటి నుండి హాలీవుడ్ పైనే ఉందని, ఈ విషయాన్ని తను గతంలో కూడా స్పష్టం చేశానన్నారు. ప్రపంచంలోని 500 పెద్ద కంపెనీలను తెలంగాణకు తీసుకురావడానికి తాము ప్రయత్నం చేస్తున్నామన్నారు. తెలంగాణలో మీ పెట్టుబడికి పూర్తి రక్షణ ఉంటుందని, తెలంగాణ రాష్ట్రం అంటేనే వ్యాపారం అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.


