Telangana
oi-Bomma Shivakumar
భారత్ లో ఎన్నో చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు, కోటలు ఉన్నాయి. అలాగే ప్రకృతి రమణీయమైన ప్రదేశాలకు మనదేశం నెలవుగా ఉంది. వీటితో పాటు జలపాతాలు, సముద్ర తీర ప్రాంతాలు, దీవులు ఇలా అనేక పర్యటక ప్రదేశాలు టూరిస్టులను ఆకట్టుకుంటున్నాయి. అయితే దేశంలోని అనేక ప్రముఖ టూరిస్ట్ ప్రాంతాల్లో అండమాన్ నికోబార్ దీవులు కూడా ఒకటి. ముఖ్యంగా వేసవి కాలంలో ఈ ప్రాంతానికి వెళ్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు. సమ్మర్ లో ఇక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. వేసవిలో ఈ ప్రాంతానికి వెళ్తే బీచ్ లో హాయిగా చిల్ అవ్వొచ్చు. పర్యటకుల కోసం ఇప్పుడు తక్కువ ధరలోనే హైదరాబాద్ TO అండమాన్ టూర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
హైదరాబాద్ నుంచి అండమాన్ నికోబార్ దీవులకు వెళ్లాలని ఉందా..? అది కూడా తక్కువ ధరలోనే.. అయితే IRCTC ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొస్తుంది. అండమాన్ దీవి లోని పోర్ట్ బ్లెయిర్, హావొలాక్ దీవి, నీల్ దీవి వంటి ప్రాంతాల పర్యటన కోసం ఈ ప్యాకేజీని రూపొందించింది. ఈ నెల 30న ఈ టూర్ ప్రారంభం కానుంది. ఈ టూర్ మొత్తం 5 రాత్రులు, 6 రోజుల పర్యటన అనంతరం ఏప్రిల్ 4 న తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారు. ఈ సమ్మర్ ప్యాకేజీలో భాగంగా సెల్యులార్ జైలు మ్యూజియం, కార్బిన్స్ కోవ్ బీచ్, రాధానగర్ బీచ్, ఎలిఫెంటా బీచ్, ఖాళా పథర్ బీచ్, లక్ష్మణ్ పూర్ బీచ్ వంటి పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం లభిస్తుంది.
ఇక ఈ టూర్ షెడ్యూల్ చూస్తే.. తొలి రోజు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి శ్రీ విజయపురం కు చేరుకుంటారు. అక్కడి నుంచి సెల్యూలార్ జైలు మ్యూజియం, కార్బిన్ కోవ్ బీచ్ సందర్శిస్తారు. అక్కడే సాయంత్రం జైలు మ్యూజియంలో లైట్ అండ్ సౌండ్ షో ఉంటుంది. రాత్రికి అక్కడే బస చేస్తారు. ఇక రెండో రోజు క్రూయిజ్ ద్వారా హావోలాక్ కు చేరుకుంటారు. అక్కడి హోటల్ లో చెకిన్ అయిన తర్వాత రాధానగర్ బీచ్ ను సందర్శిస్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.
ఇక మూడోరోజు ఎలిఫెంటా బీచ్ కు వెళ్తారు. అక్కడే స్నో రైలింగ్, స్కూబా డైవింగ్ వంటి వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి. ఇది పర్యటకులకు ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. నాలుగోరోజు ఖాళా పథర్ బీచ్, నీల్ దీవి, సాయంత్రం సీతాపూర్ బీచ్, లక్ష్మణ్ పూర్ బీచ్ లన సందర్శిస్తారు. అనంతరం ఐదో రోజు భరత్ నగర్ బీచ్ ను సందర్శిస్తారు. ఆ తర్వాత పోర్ట్ బ్లెయిర్ కు చేరుకుంటారు. చివరగా ఆరో రోజు విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్ కు చేరుకుంటారు. ఈ టూర్ కు సంబంధించిన పూర్తి వివరాల కోసం IRCTC వెబ్ సైట్ ను సంప్రదించాలని అధికారులు పేర్కొన్నారు.


