12వ పీఆర్సీకి ఛైర్మన్, 29 శాతం ఐఆర్..!!

Date:


Andhra Pradesh

oi-Sai Chaitanya

ఏపీలో వేతన సవరణ కోసం 12వ పీఆర్సీ కమిషన్‌ను తక్షణమే నియమించి, ఐఆర్‌ను 29 శాతం ప్రకటించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేసాయి. నాలుగు డిఎ బకాయిలు వెంటనే చెల్లించాలని నినదించాయి. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే పీఆర్సీ ప్రకటించకుంటే ఛలో అసెంబ్లీ నిర్వహిస్తామని అల్టిమేటం జారీ చేసాయి. బడ్జెట్ లో ఉద్యోగుల పీఆర్సీ.. ఐఆర్ ప్రస్తావన చేయకపోవటం పైన నిరసన తెలిపాయి. తాజాగా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ముందు ఉంచిన డిమాండ్ల పైన ఎలాంటి స్పందన ఉంటుందనేది కీలకంగా మారుతోంది.

విజయవాడలోని ధర్నా చౌక్‌లో ఉపాధ్యాయ సంఘాలు నిరసనకు దిగాయి. పెండింగ్‌లో ఉన్న 12వ పిఆర్‌సికి తక్షణమే ఛైర్మన్‌ను నియమించడంతోపాటు, ఐఆర్‌ను 29శాతం ప్రకటించాలని, నాలుగు డిఎ బకాయిలు వెంటనే చెల్లించాలని యుటిఎఫ్‌ నిర్వహించిన రణభేరి 2.0 డిమాండ్‌ చేసింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు తరలి వచ్చారు. ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే చలో సచివాలయానికి పిలుపు ఇస్తామని హెచ్చరించారు. శాసన మండలి, శాసన సభలో కల్తీ లడ్డూ గురించి చర్చలు పెట్టి ఇరు పక్షాలు గొడవపడటం తప్ప ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై దృష్టి సారించడం లేదన్నారు. రణభేరి కార్యక్రమం తర్వాతనైనా ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ బర్రా గోపిమూర్తి డిమాండ్ చేసారు. ఉద్యోగుల సంక్షేమం చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మరొక బిఆర్‌టిఎస్‌ రోడ్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టకముందే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు సూచించారు.

ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించాలి

పోరాటాల ద్వారా మాత్రమే గత పిఆర్‌సిలలో ఉపాధ్యాయులు, ఉద్యోగులకు మెరుగైన సౌకర్యాలు సాధించుకున్న విషయాన్ని గుర్తు చేశారు. 11వ పిఆర్‌సి దుర్మార్గమైన పిఆర్‌సి అని మాజీ ఎమ్మెల్సీ ఐవి రావు విమర్శించారు. 12వ పిఆర్‌సి సాధనకు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 12వ పిఆర్‌సి కమిషన్‌ను 2023 జులై నుంచి అమలు కావాల్సి ఉన్నా ఇంతవరకు ఛైర్మన్‌ను కూడా నియమించలేదని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు, ప్రసాద్‌ డిమాండ్ చేసారు. టిడిపి కూటమి అధికారంలోకి రావడానికి ముందు నియమించిన 11వ పిఆర్‌సి రివర్సు పిఆర్‌సి గా గుర్తు చేసారు. ఉద్యోగ, ఉపాధ్యాయులను వైసిపి ప్రభుత్వం మోసం చేసిందని, తాము అధికారంలోకి వస్తే సకాలంలో డిఎలు, మెరుగైన పిఆర్‌సి బకాయిలు చెల్లిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారని చెప్పారు. అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతున్నా ఇంత వరకు 12వ పిఆర్‌సిని నియమించలేదని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రభుత్వం ముందుకు రాకపోతే.. ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉద్యమ కార్యచరణకు రోడ్‌ మ్యాప్‌ ప్రకటించేందుకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related