India
oi-Chandrasekhar Rao
ఇరాన్పై దాడుల అనంతరం కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ వరకే ఇది పరిమితం కాలేదు. గల్ఫ్ దేశాలకూ పాకింది. యుద్ధం 15వ రోజుకు చేరుకోగా దీనికి ముగింపు కనపించట్లేదు. గల్ఫ్ ప్రాంతంలో ఇంధన సరఫరాలు, అంతర్జాతీయ ప్రయాణాలు, భద్రతకు తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఇది అనేక దేశాల్లో వేలాది మంది ప్రయాణికులను చిక్కుకుపోయేలా చేస్తోంది.
ఈ యుద్ధంలో ఇప్పటివరకు 2,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది ఇరాన్లోనే కాగా, లెబనాన్, గల్ఫ్ దేశాల్లో కూడా మరణాలు నమోదయ్యాయి. దశాబ్దాల తర్వాత తొలిసారిగా గల్ఫ్ ప్రాంతం యుద్ధ ముఖద్వారంలో నిలిచింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.
యుద్ధం కారణంగా భారత్లో చిక్కుకుపోయిన విదేశీయులకు 30 రోజుల వీసా గడువు పొడిగించారు. గడువు దాటిన తర్వాత కూడా భారత్ లో నివసించడానికి వారికి అనుమతి లభించింది. ఇది 30 రోజుల పాటు అమలులో ఉంటుంది. ఆ తర్వాత పరిస్థితులను బట్టి దీన్ని పొడిగించాలా వద్దా అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. గడువు దాటిన తర్వాత కూడా ఇక్కడ నివసించే విదేశీయులకు విధించే జరిమానాలు కూడా రద్దయ్యాయి.
పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల వల్ల ప్రయాణ అంతరాయాలతో ఇబ్బందులు పడుతున్న వారికి ఈ నిర్ణయం ఊరటనిచ్చింది. దుబాయ్లోని భారత కాన్సులేట్ జనరల్ ఈ ఉపశమన చర్యల గురించి వెల్లడించింది. గల్ఫ్ సంఘర్షణ వల్ల విమాన సర్వీసులు నిలిచిపోవడంతో భారత్ను వీడలేని ప్రయాణికులకు వెసలుబాటును కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. యుద్ధం కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు దెబ్బతిన్న నేపథ్యంలో ఈ మినహాయింపులు అమలవుతాయి.
IMPORTANT NOTICE⬇️
Extension of Regular Indian Visa/E-Visa and waiver of over stay penalty. to foreigners stuck in India due to the ongoing developments in West Asia pic.twitter.com/UZEAt78y0S
— India in Dubai (@cgidubai) March 13, 2026
దుబాయ్ లోని భారత కాన్సులేట్ ఈ వివరాలు వెల్లడించింది. గడువు ముగిసిన లేదా త్వరలో ముగియనున్న అన్ని రకాల వీసాలు/ఇ-వీసాలన్నీ కూడా ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల ద్వారా వ్యక్తిగత కేసుల ఆధారంగా నెల రోజుల పాటు ఉచితంగా పొడిగించినట్లు పేర్కొంది. పశ్చిమాసియా పరిణామాల వల్ల గడువు తీరిన తర్వాత కూడా భారత్ లో నివసించే విదేశీయులపై విధించే జరిమానాలు రద్దయినట్లు వివరించింది.
ప్రభావిత విదేశీయులకు ఎగ్జిట్ పర్మిట్లు అందిస్తామని కాన్సులేట్ తెలిపింది. వీటిని దరఖాస్తు చేయకపోవడం లేదా వీసా పొడిగింపును కోరకపోవడం వలస చట్టాల ఉల్లంఘనగా పరిగణించరు. భారత్ కు మళ్ళించిన విమానాల ప్రయాణికులకు తాత్కాలిక ల్యాండింగ్ పర్మిట్లను సైతం భారత్ ఉచితంగా అందిస్తుంది.


