India
oi-Bomma Shivakumar
భారతదేశం ఎన్నో అద్భుతమైన ప్రదేశాలకు నెలవు. మన దేశంలో ఎన్నో చారిత్రకమైన కట్టడాలు, దేవాలయాలు, కోటలు, ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు విదేశీయులను ఆకట్టుకుంటాయి. అందుకే ఏటా లక్షలాది మంది విదేశీయులు భారత్ లో పర్యటించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఏటేటా మనదేశంలోకి విదేశీయుల పర్యాటక వాణిజ్యం పెరుగుతోంది. అయితే భారత్ కు వచ్చిన విదేశీయులు ఎక్కువగా రైలు జర్నీనే ఎంచుకుంటారు. అయితే కెనడాకు చెందిన ఓ ఫ్యామిలీ భారత్ ను సందర్శించేందుకు వచ్చింది. ఇక్కడి రైలులో ప్రయాణం చేసిన ఆ ఫ్యామిలీ.. తమకు ఇదో మర్చిపోలేని అనుభూతి అని పేర్కొంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
భారత్ లోని రైలు ప్రయాణంలో కెనడా టూరిస్టులకు వింత అనుభవం ఎదురైంది. ప్రైవేట్ క్యాబిన్ అనుకుని స్లీపర్ క్లాస్ బుక్ చేసుకుంది ఆ జంట. దాంతో ఏడు గంటల ప్రయాణంలో వారికి నిద్రే కరువైనట్లు పేర్కొన్నారు. కానీ తోటి ప్రయాణికుల ఆప్యాయత, పిల్లల అల్లరికి వాళ్లు చాలా సరదాగా తమ జర్నీని పూర్తి చేశారు. ఈ అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోలేమంటూ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన ఓ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఏం జరిగిందంటే..?
కెనడాకు చెందిన కిమ్ గ్రీన్వుడ్, ఆమె స్నేహితుడితో కలిసి జల్గావ్ జంక్షన్ నుండి చంద్రపుర వరకు ప్రయాణించేందుకు రైలు టికెట్లు బుక్ చేసుకున్నారు. ప్రశాంతంగా నిద్రపోవచ్చని భావించినవారు ‘స్లీపర్ క్లాస్’ ఎంచుకున్నారు. అయితే భారత్ లో స్లీపర్ క్లాస్ అంటే ప్రైవేట్ క్యాబిన్ కాదని.. అది అందరూ కలిసి ప్రయాణించే కోచ్ అని వారికి రైలు ఎక్కాక తెలిసింది. దీంతో చేసేదేంలేక తమ సీట్లలోనే నిద్రించారు. ఇంతలో విదేశీయులను చూసిన ఆ బోగీలోని పిల్లలు వారి చుట్టూ చేరారు.
అలా ఆ బోగీలోని వారితో తాము కలిసిపోయామని వారితో సరదాగా గడిపామని గ్రీన్ వుడ్ తన పోస్టులో పేర్కొన్నారు. తోటి ప్రయాణికులు తమ ఇంట్లో వండిన ఫుడ్ ను పంచుకోవడమే కాకుండా.. స్టేషన్లలో ఆగినప్పుడు చాయ్, ఇతర తినుబండారాలు కొనిచ్చారని తన పోస్టులో పేర్కొన్నారు. ఈ 7 గంటల నిద్రలేని ప్రయాణంలో పొందిన అనుభూతి వెలకట్టలేనిది అని ఆమె తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.


