India
oi-Syed Ahmed
విపక్షాలతో పాటు గతంలో ప్రధానులుగా పనిచేసిన వాళ్ల తప్పిదాల్ని సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ (pm modi) ఇవాళ రాజ్యసభలో వెల్లడించారు. నిన్న లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీని మాట్లాడనివ్వకుండా అడ్డుకున్నందుకు నిరసనగా ఇవాళ ప్రధాని ప్రసంగాన్ని అడ్డుకునేందుకు విపక్షాలు ప్రయత్నించాయి. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ముగింపు పలుకుతూ ప్రధాని కీలక ప్రసంగం చేశారు.
ఓవైపు తాను ప్రసంగం చేస్తున్నా నిలబడి నినాదాలు చేస్తున్న విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గేను ఉద్దేశించి…”మీ వయస్సు ప్రకారం మీరు కూర్చుని నినాదాలు చేయవచ్చని ప్రధాని మోడీ చురకలు అంటించారు. అనంతరం అభివృద్ధి చెందిన దేశాలకు వృధ్యాప్యం వస్తుంటే, మన దేశానికి మాత్రం యవ్వనం వస్తోందన్నారు. ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన ప్రతిభావంతులైన సమూహాలలో మనదీ ఒకటన్నారు. ప్రపంచ సంఘర్షణల సమయంలో భారతదేశం ఒక ఆశాకిరణంగా నిలుస్తోందన్నారు.
భారతదేశం అధిక వృద్ధి, తక్కువ ద్రవ్యోల్బణం యొక్క ప్రత్యేక కలయికను కలిగి ఉందని ప్రధాని మోడీ గుర్తుచేశారు. ప్రపంచం మొత్తం ప్రపంచ దక్షిణాది గురించి మాట్లాడుతుందని, భారత్ ప్రపంచ దక్షిణాదికి స్వరంగా మారిందన్నారు. గతంలో భారత్ తో ఒప్పందాలు చేసుకోవడానికి ఏ దేశం సిద్ధంగా లేదని, కానీ ఇవాళ యూరప్, అమెరికా ఒప్పందాలు చేసుకున్నాయని గుర్తుచేశారు. తన మాటల్ని నమ్మకపోతే గతంలో ఎర్రకోట వద్ద ప్రధానులు చేసిన ప్రసంగాలను పరిశీలించాలన్నారు.
వారికి ఎటువంటి ఆలోచన, దార్శనికత, ప్రణాళిక లేదనేదనేది అర్ధమవుతోందనంటూ ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. వారి చెత్తను శుభ్రం చేయడమే తన పని అని ప్రధాని మోదీ అన్నారు. ప్రస్తుతం భారత్ సంస్కరణల దిశగా పయనిస్తోందని,
మన దేశంతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ప్రపంచం ఆసక్తిగా ఉందని తెలిపారు. అమెరికా వాణిజ్య ఒప్పందం తర్వాత, ప్రపంచం స్థిరత్వంతో పాటు మన వేగాన్ని కూడా గుర్తిస్తుందన్నారు. ఈ ఒప్పందం యువతకు ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. ప్రపంచ మార్కెట్ వారి కోసం తెరిచామన్నారు.


