India
oi-Chandrasekhar Rao
సీనియర్ నాయకుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్ర పవార్) అధినేత శరద్ పవార్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందిస్తోన్నారు. ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ అయిన సమాచారం తెలిసిన వెంటనే పలువురు నాయకులు, కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకుంటోన్నారు.
శరద్ పవార్.. బారామతిలోని ‘గోవింద్ బాగ్’ నివాసంలో ఉంటోన్నారు. కొద్దిసేపటి కిందట ఆయన అనారోగ్యానికి గురయ్యారు. అకస్మాత్తుగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో బారామతి నుండి పూణేలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో ఆయన వెంట కుమార్తె, లోక్ సభ సభ్యురాలు సుప్రియా సూలే, అల్లుడు సదానంద్ సూలే ఉన్నారు.
ఈ ఉదయం నుంచీ ఆయన ఆరోగ్యం కొంత క్షీణిస్తూ వచ్చినట్లు చెబుతున్నారు. ఈ ఉదయం 10:30 గంటలకు ఇద్దరు డాక్టర్లతో కూడిన అంబులెన్స్ ‘గోవింద్ బాగ్’ నివాసానికి చేరుకుంది. ఇంట్లోనే ఆయనకు ప్రాథమిక పరీక్షలను నిర్వహించారు. రెండు గంటలకు పైగా వైద్య పరీక్షలు కొనసాగినట్లు తెలుస్తోంది.
ఆ సమయంలో- శరద్ పవార్ కు మరింత మెరుగైన, పూర్తి స్థాయి చెకప్, చికిత్స అవసరమని డాక్టర్లు సలహా ఇవ్వడంతో ఆయనను హుటాహుటిన పూణేలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తరలించారు. ఆయన అనారోగ్యానికి గల కారణాలు ఏమిటనేది ఇంకా అధికారికంగా తెలియరాలేదు. గొంతు ఇన్ఫెక్షన్, జ్వరం కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం.
శరద్ పవార్ వయస్సు, గత ఆరోగ్య చరిత్ర దృష్ట్యా ఈ సమాచారం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళనను నింపింది. పవార్ చేరిన పూణే ఆసుపత్రి వద్ద బందోబస్తును ఏర్పాటు చేశారు. సుప్రియా సూలే నిరంతరం డాక్టర్లతో సంప్రదిస్తున్నారు. సాయంత్రంలోగా అధికారిక హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది.


