Telangana
oi-Dr Veena Srinivas
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడిన ఆయన, తనకు పోటీ ఎవరూ లేరని స్పష్టం చేశారు. రాబోయే పదిన్నర సంవత్సరాల పాటు తానే తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగుతానని, రాష్ట్రానికి తానే రాజు, తానే మంత్రిని అంటూ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
అంతేకాదు దేశంలో జమిలి ఎన్నికలపైన వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి 2029లో జమిలి ఎన్నికలు జరుగుతాయని అన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన అంశాలపైన కూడా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపైన మాట్లాడిన సీఎం రేవంత్ ఈ కేసులో దర్యాప్తు చివరి దశకు చేరుకుందని అన్నారు. దర్యాప్తు ఆధారంగా కేసులో ముందుకు వెళ్తామని పేర్కొన్నారు.
కేసీఆర్ ను జైల్లో పెట్టాలంటే నిబంధనల ప్రకారమే
తనకు ఎవరి విషయంలోనూ కక్షలు లేవని, తమ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఒకవేళ కేసీఆర్ ను జైలులో పెట్టాలంటే అది నిబంధనల ప్రకారమే జరుగుతుందని ఆయన వ్యాఖ్యలు చేశారు, అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎవరి ఫోన్లను ట్యాప్ చేయలేదని రెడ్డి స్పష్టం చేశారు. ఫోన్ సంభాషణలను ట్యాప్ చేస్తే ఆయుష్షు తగ్గుతుందని ఎద్దేవా చేశారు.
కిషన్ రెడ్డిని టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి
ఇతరుల కాల్స్ వినడం ఒక మానసిక రోగం అంటూ ఘాటుగా స్పందించారు. సింగరేణికి రాష్ట్రప్రభుత్వం బకాయిలు ఉన్నాయన్న అంశంపైన స్పందించిన రేవంత్ రెడ్డి కెసిఆర్ హయాం నుంచి ఆ బకాయిలు పేరుకుపోయాయని పేర్కొన్న రేవంత్ రెడ్డి పదేళ్లపాటు కేసీఆర్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక్క మాట కూడా అడగలేదని ఇప్పుడు తనని ఎందుకు ప్రశ్నిస్తున్నాడు అంటూ ప్రశ్నించారు.
కేసీఆర్, కేటీఆర్ పై చర్యలేవి? సీఎం రేవంత్
కెసిఆర్, హరీష్ రావు చెప్పినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం నడవదని స్పష్టం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. కాళేశ్వరం అక్రమాలు, ఫార్ములా ఈ రేసు కేసుపైన కేంద్రం చర్యలు ఎక్కడంటూ ప్రశ్నించారు. త్వరలోనే అన్ని సంబంధిత పత్రాలను అసెంబ్లీలో ప్రవేశపెడతామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా అధ్యయనం చేయడానికి నిపుణుల కమిటీ అప్పగించామని ముఖ్యమంత్రి తెలిపారు. మూడు గేట్ల మరమ్మత్తుల తర్వాత ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోతే దానిని తమ ప్రభుత్వం పైన నెట్టాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోందని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.


