Telangana
oi-Dr Veena Srinivas
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని తండాలకు శుభవార్త చెప్పింది. అన్ని లంబాడా తండాలకు బీటీ రోడ్లు నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మేరకు స్పష్టం చేశారు. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. హైదరాబాద్లోని బంజారా భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వ సహకారం లంబాడా యువతకు ఉంటుందని ఇచ్చారు.
రోడ్లు లేని తండాలు ఉండవు: సీఎం రేవంత్
తెలంగాణ రాష్ట్ర సాధనలో, ఆ తర్వాత పునర్నిర్మాణంలో లంబాడా యువత కీలక పాత్ర పోషించారని సీఎం రేవంత్ గుర్తుచేశారు. ఈ క్రమంలో, ప్రభుత్వం తండాల పురోగతికి నడుం బిగించింది అన్నారు. తండాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. రోడ్లు లేని తండా రాష్ట్రంలో ఉండకూడదని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
తన పురోగతిలో లంబాడీల పాత్ర
సీఎం రేవంత్ రెడ్డి తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం మరో నాలుగు నెలల్లో పూర్తి కానుందని పేర్కొన్నారు . ఈ లోపే అన్ని తండాలకు రోడ్ల సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. స్వతంత్ర జడ్పీటీసీగా పోటీ చేసినప్పుడు లంబాడా యువత అందించిన మద్దతును ఆయన స్మరించుకున్నారు. తాను ఈ రోజు సాధించిన పురోగతిలో లంబాడీల పాత్ర ఉందన్నారు.
తండాలు దాటి యువత బయటకు రావాలి
తండాల్లో విద్యా ప్రమాణాలను పెంచడం లక్ష్యంగా ప్రతి తండాలో ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. లంబాడా యువకులు కేవలం తండాలకే పరిమితం కాకుండా, తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తండాల్లోనే ఉంటాం అనే ఆలోచన నుంచి బయటపడాలని రేవంత్ రెడ్డి సూచించారు.
తండాల యువత టార్గెట్ పెట్టుకుని ఉన్నత లక్ష్యాలు సాధించాలి
తండాలలోని యువత గ్రూప్-1, గ్రూప్-2, డాక్టర్, లాయర్, ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత స్థానాలను లక్ష్యంగా పెట్టుకుని చదువులో పోటీ పడాలన్నారు. దీనికి ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టత ఇచ్చారు.


