Telangana
oi-Bomma Shivakumar
ఈ నెల 23న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఫిబ్రవరి 23న మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు, రైతు భరోసాపై చర్చించే అవకాశం ఉంది. అలాగే జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు శాఖలవారీగా బడ్జెట్ కేటాయింపులు, కొత్త పథకాల అమలుపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఫిబ్రవరి 23న మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, నిధుల కేటాయింపులు, కొత్త పథకాల అమలుపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనుంది. 2026-27 వార్షిక బడ్జెట్ తుది దశకు చేరిన నేపథ్యంలో ఈ మంత్రివర్గ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ను ఖరారు చేయనున్నారు. తాజా సమాచారం ప్రకారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 26 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇక దాదాపు 10 నుంచి 15 రోజుల పాటు ఈ సమావేశాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సమావేశంలో రైతు భరోసా, వివిధ ప్రభుత్వ శాఖలకు నిధుల కేటాయింపు, సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యతపై చర్చించే అవకాశం ఉంది.
అలాగే ఆరు గ్యారంటీలపై బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లు, గృహ జ్యోతి వంటి పథకాలకు అవసరమైన ఆర్థిక వెసులుబాటుపై ఈమేరకు కేబినెట్ తుది నిర్ణయం తీసుకోనుంది. ఇక తాజాగా మున్సిపాల్టీలకు రూ. 25కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు రూ.25 కోట్లు మంజూరు చేస్తూ పురపాలకశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు తెలంగాణలో పురపాలక శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలోకి వెళ్లకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సచివాలయంలో నిర్వహించిన పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖపై సమీక్ష సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. కమిషనర్లు, జోనల్ కమిషనర్లు ఉదయం నుంచి ఫీల్డ్ లో ఉండాలి. పారిశుద్ధ్యం, రోడ్ల శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి. రోడ్లు శుభ్రంగా లేకపోతే అక్కడిక్కడే అధికారులను సస్పెండ్ చేస్తాను’ అని హెచ్చరించారు.


