Telangana
oi-Dr Veena Srinivas
తెలంగాణా రాష్ట్రంలో మంత్రులు అవినీతిలో కూరుకుపోయారని, వారికి ఐఎఎస్ లు సహకరిస్తున్నారు అని కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారి చిట్టా బయటకు తీస్తున్నామని అన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు.టీపీసీసీ కరప్షన్-కమీషన్-కలెక్షన్-కాంగ్రెస్ గా మారింది అని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మంత్రులు, అధికారుల అవినీతిపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రంలో కొందరు మంత్రులు విస్తృతంగా అవినీతికి పాల్పడుతున్నారని, వారికి కొందరు ఐఏఎస్ అధికారులు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.ఆయా మంత్రులు, అధికారులపై ఆధారాలు సేకరిస్తున్నామని, త్వరలోనే వాటిని ప్రజల ముందుకు తీసుకువస్తామని తెలిపారు. జీహెచ్ఎంసీని ప్రజాభిప్రాయం లేకుండా మూడు భాగాలుగా విభజించడాన్ని బండి సంజయ్ తీవ్రంగా విమర్శించారు.
గ్రేటర్ హైదరాబాద్ విభజన ఏకపక్ష నిర్ణయం
గ్రేటర్ హైదరాబాద్ను గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లుగా విభజించడం ఏకపక్ష నిర్ణయమని, దీనికి అఖిల పక్ష అభిప్రాయం, ప్రజాభిప్రాయం వద్దా అన్నారు. ఈ నిర్ణయం వెనుక రాజకీయ ప్రయోజనాలే ఉన్నాయని ఆరోపించారు. హైదరాబాద్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సరైన నిధులు కేటాయించలేదని కూడా బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
ఆ హామీలు, ప్రకటనలపై స్పష్టత ఇవ్వండి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్
రాబోయే జీహెచ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెబుతారని బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం చెప్పిన వాగ్దానాలపై స్పష్టత ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. దావోస్ పర్యటనలలో ప్రకటించిన పెట్టుబడులపై వివరాలు వెల్లడించాలని కోరారు. ఇప్పటివరకు దావోస్ లో తెలంగాణాకు పెట్టుబడులు పబ్లిసిటీకే పరిమితం అయ్యిందన్నారు.
వచ్చే ఎన్నికల్లో జీహెచ్ఎంసీలో కాషాయజెండా ఎగరటం ఖాయం
బీజేపీకి జీహెచ్ఎంసీలో అనుకూల వాతావరణం ఉందని, రాబోయే ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేస్తామని కేంద్రమంత్రి బండి సంజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు. కరీంనగర్ ఎన్నికల ఫలితాలు హైదరాబాద్ లో రిపీట్ అవుతాయని ఆయన అన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అందిస్తున్న నిధులే ప్రధాన ఆధారమని పేర్కొన్నారు.మంత్రుల అవినీతి, అధికారుల పాత్రపై త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని, అవినీతి అధికారుల, మంత్రుల సంగతి చూస్తామని ఆయన స్పష్టం చేశారు.


