Andhra Pradesh
oi-Lingareddy Gajjala
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మెల్లమెల్లగా సెగలు పుట్టిస్తున్న తరుణంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రాగల మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారనుంది.
సముద్ర మట్టంలో ఏర్పడిన మార్పులను గమనిస్తే.. ప్రస్తుతం రెండు చోట్ల వాతావరణ అలజడి కొనసాగుతోంది. నిన్న హిందూ మహాసముద్రం, నైరుతి బంగాళాఖాతం పరిసరాల్లో ఉన్న అల్పపీడనం నేడు (ఫిబ్రవరి 20) బలహీనపడింది. అయితే, దీని ప్రభావంతో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం శ్రీలంక వైపు కదులుతోంది.
మరోవైపు, ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే 48 గంటల్లో కొత్తగా మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉంది.
మూడు రోజుల వాతావరణ అంచనా
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, తూర్పు దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా వచ్చే మూడు రోజుల్లో వాతావరణం ఇలా ఉండబోతోంది:
- ఉత్తర కోస్తా & యానాం: రాబోయే మూడు రోజుల పాటు పొడి వాతావరణమే ఉంటుంది. అయితే, రేపు (శనివారం) ఒకటి లేదా రెండు చోట్ల తెల్లవారుజామున పొగమంచు కురిసే అవకాశం ఉంది.
- దక్షిణ కోస్తా: ఈరోజు, రేపు పొడి వాతావరణం ఉన్నప్పటికీ.. ఎల్లుండి (ఆదివారం) నుంచి వాతావరణం చల్లబడనుంది. ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
- రాయలసీమ: సీమ వాసులకు వర్ష గండం పొంచి ఉంది. ఈరోజు వాతావరణం పొడిగా ఉన్నా, రేపు మరియు ఎల్లుండి రాయలసీమలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురిసే అవకాశం ఉంది.
ఎండలు మండుతున్నాయి..
రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు అప్పుడే గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. తాజా గణాంకాల ప్రకారం.. కర్నూలులో అత్యధికంగా 36.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై భానుడి భగభగలు మొదలయ్యాయి. ఇక కళింగపట్నంలో కనిష్టంగా 30.9 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యింది. అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురిస్తే ఉష్ణోగ్రతల నుంచి కొంత ఉపశమనం లభించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.


