India
oi-Syed Ahmed
కేరళలో ఎన్నికల వేళ విడుదలకు సిద్ధమవుతున్న “ద కేరళ స్టోరీ2” (The Kerala Story 2)సినిమా తీవ్ర వివాదాస్పదం అవుతోంది. ఈ సినిమాలో కేరళలో ఉన్నవీ, లేనివీ కల్పించి చూపించి మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ స్వయంగా సీఎం పినరయి విజయన్ తో పాటు బీజేపీ మినహా అన్ని పార్టీల నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో కేరళ స్టోరీ2 వివాదం హైకోర్టును చేరింది. దీనికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు స్పందించింది.
ది కేరళ స్టోరీ 2 సినిమా సర్టిఫికేషన్ పై వివాదం, రాష్ట్రాన్ని ప్రతికూలంగా చిత్రీకరిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో రేపు ఈ సినిమాను చూస్తామని హైకోర్టు జడ్డీలు తెలిపారు. ఈ సినిమాను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ను విచారించిన జస్టిస్ బెచు కురియన్ థామస్ నేతృత్వంలోని ధర్మాసనం..కోర్టులు సాధారణంగా కళాత్మక వ్యక్తీకరణలో జోక్యం చేసుకోవడానికి ఇష్టపడకపోయినా, కేరళలో ప్రజలు లేవనెత్తిన ఆందోళనలను విస్మరించలేమని తెలిపింది. ఎందుకంటే రాష్ట్రం పేరు టైటిల్లో వాడారని గుర్తుచేసింది.
ప్రస్తుతం కేరళ పూర్తి మత సామరస్యంతో జీవిస్తుందని, కానీ కేరళ అంతటా ఇలా జరుగుతోందంటూమీరు చిత్రీకరించారని సినిమా నిర్మాతల్ని ఉద్దేశించి హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇది ఓ తప్పుడు సంకేతమని, ఉద్రేకాన్ని రెచ్చగొట్టేలా ఉందని తెలిపింది. అక్కడే సెన్సార్ బోర్డు జోక్యం చేసుకుంటుందని, మీరు దానిని పరిగణనలోకి తీసుకున్నారా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. కాబట్టి ఈ వివాదాస్పద చిత్రంపై తదుపరి ఆదేశాలు జారీ చేసే ముందు సినిమాను చూస్తామని కోర్టు తెలిపింది. ఆ తర్వాతే దీనిపై ఏదైనా నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది.


