డేంజర్ జోన్‌లో ఏపీ.. 1000 రోజుల పాటు వడగాల్పులా?

Date:


Andhra Pradesh

oi-Lingareddy Gajjala

నైరుతి అంతర కర్ణాటక నుండి మధ్య మహారాష్ట్ర వరకు సముద్ర మట్టానికి సుమారు 0.9 కి.మీ ఎత్తులో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు యానాం పరిసరాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, తూర్పు దిశల నుండి గాలులు వీస్తున్నాయి. ఫలితంగా వచ్చే మూడు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.

ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉండగా, ఒకటి రెండు చోట్ల పొగమంచు కురిసే ఛాన్స్ ఉంది. అయితే, దక్షిణ కోస్తాలో మాత్రం నేడు అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Weather : వడగాల్పుల ముప్పు – ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానం

కేవలం ప్రస్తుత మార్పులే కాకుండా, దీర్ఘకాలికంగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో వడగాల్పుల తీవ్రత ఆందోళనకరంగా మారుతోంది. గత 50 ఏళ్ల (1969-2019) గణాంకాలను పరిశీలిస్తే, దేశంలోనే అత్యధికంగా 700 నుండి 1000 రోజుల పాటు వడగాల్పులు వీచిన రాష్ట్రంగా ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. హీట్ రిస్క్ ఇండెక్స్ (HRI) ప్రకారం అత్యంత వేడి ప్రభావానికి గురయ్యే పది రాష్ట్రాలలో ఏపీ ఎనిమిదో స్థానంలో ఉంది. రాష్ట్రంలో అధిక శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడి ఆరుబయట పనిచేయడం వల్ల వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఇక్కడ ఎక్కువగా ఉంది.

జిల్లాల వారీగా పెరిగిన ముప్పు

ప్రస్తుత అంచనాల ప్రకారం.. ఉమ్మడి శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు ‘అత్యంత ప్రమాదకర’ (Very High Risk) జాబితాలో ఉన్నాయి. విజయనగరం, విశాఖపట్నం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలైన కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలు ‘హై రిస్క్’ కేటగిరీలో కొనసాగుతున్నాయి. ఐఎండీ సమాచారం ప్రకారం, ముఖ్యంగా కర్నూలు, అనంతపురం, నెల్లూరు, గుంటూరు మరియు విశాఖపట్నం వంటి ప్రాంతాలలో వడగాల్పులు వీచే రోజుల సంఖ్య ఏటికేడాది పెరుగుతోంది.

అర్బన్ హీట్ ఐలాండ్ – వెచ్చటి రాత్రులు

మారుతున్న పట్టణీకరణ వల్ల నగరాల్లో వేడి తీవ్రత గ్రామీణ ప్రాంతాల కంటే రెండింతలు వేగంగా పెరుగుతోంది. దీనినే శాస్త్రవేత్తలు ‘అర్బన్ హీట్ ఐలాండ్’ పరిణామంగా పిలుస్తున్నారు. పగటిపూట నమోదయ్యే గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటు, రాత్రిపూట కూడా వేడి తగ్గకపోవడంతో ప్రజలు ‘వెచ్చటి రాత్రుల’ వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. గత 40 ఏళ్లలో 2013, 2016, 2019 మరియు 2024 సంవత్సరాల్లో రికార్డు స్థాయిలో ఎండలు నమోదు కావడం భూతాపం తీవ్రతను తెలియజేస్తోంది.

కార్యాచరణ ప్రణాళికల ఆవశ్యకత

పెరుగుతున్న వడగాల్పుల తీవ్రతను ఎదుర్కోవడానికి ప్రస్తుతం ఉన్న హీట్ యాక్షన్ ప్లాన్స్‌ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కేవలం పగటి ఉష్ణోగ్రతలనే కాకుండా.. గాలిలోని తేమ శాతం, రాత్రిపూట వేడి, స్థానిక జనాభా పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలి. వాతావరణ మార్పుల దృష్ట్యా ఈ ఏడాది ఎండల తీవ్రత మరియు తరచుదనం పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలే ప్రాణరక్షణకు మార్గమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related