కరీంనగర్ సీపీపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Date:


Telangana

oi-Dr Veena Srinivas

వివాదాలకి కేరాఫ్ అయిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంపై తీవ్ర ఆరోపణలు చేసిన ఆయన త్వరలోనే ఆయన బండారం బయటపెడతా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య వివాదం తారా స్థాయికి చేరుకుంది.

ప్రభుత్వ వాహనాలు ప్రైవేట్ వ్యక్తులకు వాడుతున్న సీపీ: పాడి కౌశిక్ రెడ్డి

సమ్మక్క సారలమ్మ జాతర సమయంలోనూ ఆయనను, ఆయన భార్యను బలవంతంగా బయటకు పంపారని గొడవ చేసిన కౌశిక్ రెడ్డి తాజాగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.సీపీ గౌస్ ఆలం పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వ వాహనాలను ప్రైవేటు వ్యక్తుల కోసం వాడుతున్నారని విమర్శించారు.

ఇన్నోవా క్రిస్టా కారుతో సీపీ ఇలా చేస్తున్నారని ఆరోపణ

ఒక ఇన్నోవా క్రిస్టా కారును హైదరాబాద్‌లో వినియోగిస్తూ, జిల్లా కానిస్టేబుళ్లను దానికి డ్రైవర్లుగా నియమించారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఆ ఇన్నోవా కారును కమిషనర్ తన స్నేహితుడు, ఐఆర్ఎస్ అధికారి వికాస్ అగర్వాల్ తండ్రి ఇంటికి పంపి, ఆయన్ను రోజూ నిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లడానికి వాడుతున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు.

కరీంనగర్ సీపీపై ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

ఎనిమిది నెలలుగా డీజీపీ కార్యాలయం దగ్గర ఒక అపార్ట్‌మెంట్ వద్ద ఆ వాహనం తిరుగుతుంటే, డీజీపీ శివధర్ రెడ్డికి ఈ విషయం తెలుసా లేదా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. కరీంనగర్ సీపీ పెద్దఎత్తున నగదు వసూళ్ళకు పాల్పడుతున్నారని, దీనికి సంబంధించిన ఆధారాలు త్వరలోనే బయటపెడతా అనిపాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. అక్రమ దందాలు చేస్తున్న సీపీపై తక్షణం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఆ వీడియోలు, ఫోటోలు బయటపెడతా

సీపీపై చర్యలు తీసుకోకపోతే 15 రోజుల్లో అన్ని వాస్తవాలు వెల్లడి చేస్తానన్నారు. ఇది ట్రైలర్ మాత్రమే అని, అసలు సినిమా త్వరలో చూపిస్తానని అన్నారు. ఇప్పుడు ఈ వ్యవధిలో తప్పు దిద్దుకుంటే సరి లేదంటే మీ అక్రమ లీలల వీడియోలు, ఫోటోలు అన్నీ నా దగ్గర ఉన్నాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. యాంటీ ఛాంబర్‌లో, హైదరాబాద్ రిసార్ట్‌లో జరిగినవి అన్నీ బయటపెడతాను అని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు.

15 రోజుల సమయం ఇస్తున్నా.. పాడి కౌశిక్ రెడ్డి వార్నింగ్

ఐపీఎస్, ఐఏఎస్ అధికారులపై తనకు గౌరవం ఉందని, ఆ గౌరవం తోనే ఇప్పటివరకు సంయమనం పాటించానని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. 15 రోజుల సమయం ఇస్తున్నా,, చేసిన తప్పు సరిదిద్దుకోకపోతే, అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ వీడియోలు చూపిస్తా అంటూ పేర్కొన్నారు. అక్కడ కూడా కుదరకపోతే, అసెంబ్లీ మీడియా పాయింట్‌లోనే అన్నింటినీ బయటపెడతా. ఒకరిద్దరు అధికారుల కోసం అందరూ పరువు పోగొట్టుకోవద్దు, అని కౌశిక్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related