Telangana
oi-Jakki Mahesh
హైదరాబాద్ శివార్లలోని నార్సింగి ప్రాంతంలో మంగళవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. మూసీ నది పరివాహక ప్రాంతంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్థానికులతో కలిసి భారీ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ‘హైడ్రా’ పేరుతో కేవలం పేదల ఇళ్లను, గుడిసెలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని కూల్చివేస్తోందని తీవ్రంగా మండిపడ్డారు. ఖమ్మంలోని వెలుగుమట్లతో పాటు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో పేదల నివాసాలను అక్రమంగా తొలగించారని ఆమె ధ్వజమెత్తారు.
పెద్దల భవనాలు హైడ్రాకు కనిపించడం లేదా?:
మూసీ నది నడిబొడ్డున బహుళ అంతస్తుల భవనాలు, భారీ రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలుస్తున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని కవిత ప్రశ్నించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఈ భారీ కట్టడాలు కనిపించడం లేదా అని నిలదీశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిబంధనల ప్రకారం అనుమతులు ఇచ్చామని, అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల పాటు పనులు ఆపి.. మళ్లీ కమీషన్లు తీసుకుని అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.
నిబంధనల ఉల్లంఘనపై ఫైర్:
నది ఒడ్డు నుంచి కనీసం 30 మీటర్ల దూరం ఉండాలనే నిబంధనను సామాన్యులకు విధిస్తున్న ప్రభుత్వం.. కొందరు బడా వ్యాపారవేత్తల భవనాలు నదికి కేవలం 5 మీటర్ల దూరంలో ఉన్నా ఎలా అనుమతి ఇస్తోందని కవిత ప్రశ్నించారు. ఖమ్మంలోని వెలుగుమట్లలో 600 మంది పేదల ఇళ్లు కూల్చేశారన్న కవిత.. త్వరలోనే అక్కడకు వెళ్తామని చెప్పుకొచ్చారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో మధు రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. అక్రమంగా నిర్మిస్తున్న ఈ భారీ భవనాల వద్దకు హైడ్రా బుల్డోజర్లు వచ్చే వరకు తాము కదిలేది లేదని అక్కడే భీష్మించుకుని కూర్చున్నారు.
అరెస్ట్, భవిష్యత్ కార్యాచరణ
ఆందోళన ఉద్ధృతం కావడంతో పోలీసులు కవితను, ఆమె అనుచరులను అదుపులోకి తీసుకుని నార్సింగి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ప్రభుత్వం తనను బలవంతంగా అరెస్ట్ చేసిందని, అక్రమ అరెస్టులతో తమ గొంతు నొక్కలేరని అన్నారు. పేదల పక్షాన నిలబడాల్సిన ప్రభుత్వం పెద్దల కొమ్ముకాస్తోందని విమర్శించారు. అక్రమ నిర్మాణాలపై చట్టపరంగా, న్యాయపరంగా పోరాటం కొనసాగిస్తామని, త్వరలోనే ఖమ్మం వెలుగుమట్ల బాధితులను పరామర్శిస్తానని ఆమె స్పష్టం చేశారు. న్యాయం అందరికీ ఒకే విధంగా ఉండాలన్నదే తమ పోరాటమని.. కచ్చితంగా మూసీని, తెలంగాణ వనరులను పరిరక్షించుకుంటామని కవిత వెల్లడించారు.


