ఆయిల్ కోసం అమెరికా పర్మిషన్ అవసరం లేదు: తేల్చేసిన కేంద్రం

Date:


India

oi-Lingareddy Gajjala

ప్రస్తుతం అంతర్జాతీయంగా మారుతున్న సమీకరణాల నేపథ్యంలో, భారతదేశపు ముడి చమురు దిగుమతులపై జరుగుతున్న చర్చ.. కేవలం వ్యాపారానికి సంబంధించింది కాదు, అది ఒక దేశం తన సార్వభౌమాధికారాన్ని ప్రపంచ వేదికపై ఎలా చాటుతుందో తెలిపే వ్యూహాత్మక విశ్లేషణ.

ఇరాన్-యుఎస్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నడుమ, రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడానికి అమెరికా “అనుమతి” ఇచ్చిందన్న వార్తలు తెరపైకి రావడం ఒక రకమైన వక్రీకరణే. ఈ విషయంలో భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. అసలు ఏ దేశం నుంచి చమురు కొనాలో నిర్ణయించుకునే అధికారం, స్వేచ్ఛా స్వతంత్ర దేశాలకు ఉంటుంది. అయితే ఫలానా దేశం.. మరో దేశం నుంచి మనం ఆయిల్ కోనుగోలు చేయడానికి అనుమతి ఇవ్వడం ఏంటని ఇప్పుడు ప్రశ్న. భారతదేశం వంటి భారీ ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం, తన 140 కోట్ల మంది ప్రజల ఇంధన భద్రత కోసం తీసుకునే నిర్ణయాలు పరాయి దేశాల అభీష్టాలపై ఆధారపడి ఉండవని గత కొన్నేళ్లుగా కేంద్రం స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది. ఇప్పుడు మరోసారి ఈ విషయాన్ని చాటిచెప్పే అవకాశం వచ్చింది.

వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి..

గణాంకాలను లోతుగా పరిశీలిస్తే, ఫిబ్రవరి 2026 నాటికి రష్యా భారతదేశానికి అతిపెద్ద ముడి చమురు సరఫరాదారుగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. భారతీయ రిఫైనరీలు రోజుకు సగటున 10 లక్షల నుండి 17 లక్షల బ్యారెళ్ల చమురును రష్యా నుండి సేకరిస్తున్నాయి. అంటే మన దేశం చేస్తున్న మొత్తం దిగుమతుల్లో దాదాపు 25 నుండి 30 శాతం వాటా ఒక్క రష్యాదే. ఒకవేళ విదేశీ శక్తుల నియంత్రణ లేదా అనుమతి అన్నదే నిజమైతే, ప్రపంచవ్యాప్తంగా ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశం నుంచి ఈ స్థాయిలో దిగుమతులు చేసుకోవడం అసాధ్యం. ఇది భారత్ పాటిస్తున్న ‘వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి’ (Strategic Autonomy) కి నిదర్శనం.

బాధ్యతాయుతమైన రాజనీతి..

భారతదేశం తన ఇంధన అవసరాల్లో 85 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. ఇటువంటి పరిస్థితులలో, చమురు అనేది ఒక రాజకీయ సాధనం కాదు, అది దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రాణాధారం. రాయితీ ధరకు రష్యా నుండి కొనుగోలు చేసే ప్రతి బ్యారెల్ చమురు, దేశీయంగా రవాణా, విద్యుత్ తయారీ రంగాల ఖర్చులను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది అంతిమంగా సామాన్య మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్‌లపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అంతర్జాతీయంగా ధరల షాక్‌లు తగిలినప్పుడు తన పౌరులను రక్షించుకోవడానికి ప్రభుత్వం మార్కెట్ పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవడం ఒక బాధ్యతాయుతమైన రాజనీతి.

అయ్యా శరణం అంటూ వేడుకునే పరిస్థితులు కావు..

అమెరికాతో పాటు ఇతర పాశ్చాత్య దేశాలతో భారత్ జరిపే చర్చలు కేవలం దౌత్యపరమైన సంప్రదింపులు మాత్రమే తప్ప, అయ్యా శరణం అంటూ వేడుకునే పరిస్థితులు కావు. ప్రపంచ రాజకీయాల్లో అగ్రరాజ్యాల మధ్య సుంకాలు, వాణిజ్య పరిమితులపై చర్చలు సహజం. కానీ ఆ చర్చలను “అనుమతి” గా చిత్రీకరించడం భారతదేశపు విదేశీ విధానాన్ని తక్కువ చేయడమే అవుతుంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఖతర్ వంటి దేశాల నుండి గ్యాస్ సరఫరా నిలిచిపోయిన నేపథ్యంలో, భారత్ తన సరఫరా వనరులను విస్తరించుకోవడం ఎంతో అవసరం. ఈ క్రమంలో రష్యా ఒక నమ్మకమైన ఇంధన భాగస్వామిగా నిలుస్తోంది.

మొత్తంగా చూస్తే, భారతదేశపు చమురు విధానం ఆచరణాత్మకమైనది. జాతీయ ప్రయోజనాలే పరమావధిగా సాగుతోంది. కేంద్రం తన సార్వభౌమత్వానికి భంగం కలగకుండానే అటు రష్యాను, ఇటు అమెరికాను సమన్వయం చేస్తూ తన దేశాభివృద్ధికి కావాల్సిన ఇంధనాన్ని అత్యంత పోటీ ధరలకు సమకూర్చుకుంటోంది. ఇది ఒక కొత్త భారతదేశపు తెగువ.. ఇది ఎవరి నియంత్రణలోనూ లేనిది. పూర్తిగా మన స్వేచ్ఛకు, మన సార్వభౌమత్వానికి నిలువుటద్దం.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related