India
oi-Jakki Mahesh
విమాన ప్రయాణాల్లో కఠినమైన భద్రతా నిబంధనలు ఉన్నప్పటికీ.. కొందరు ప్రయాణికులు చేసే పనులు తోటి ప్రయాణీకుల ప్రాణాలను ప్రమాదంలో నెడుతున్నాయి. తాజాగా ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్న ఆకాశ ఎయిర్ విమానంలో ఓ ప్రయాణీకుడు ఏకంగా టాయిలెట్లో బీడీ తాగుతూ పట్టుబడటం సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై గోవా పోలీసులు కేసు నమోదు చేశారు.
అసలేం జరిగిందంటే?
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. శనివారం (మార్చి 7) ఢిల్లీ నివాసి అయిన ఆశిష్ అనే ప్రయాణికుడు ఢిల్లీ నుంచి గోవాకు ఆకాశ ఎయిర్ విమానంలో ప్రయాణిస్తున్నాడు. విమానం గాల్లో ఉండగా.. నిందితుడు విమానంలోని లావెట్రీలోకి వెళ్లి రహస్యంగా బీడీ వెలిగించాడు. పొగ రావడాన్ని గమనించిన విమాన సిబ్బంది వెంటనే అప్రమత్తమై అతడిని పట్టుకున్నారు. నిందితుడి వద్ద ఒక లైటర్ కూడా ఉన్నట్లు గుర్తించారు.
భద్రతకు ముప్పు
విమానంలో ధూమపానం చేయడం చట్టరీత్యా నేరం మాత్రమే కాదు.. అది విమాన భద్రతకు పెద్ద ముప్పు. లైటర్, నిప్పు వల్ల విమానంలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగే అవకాశం ఉందని, ఇది వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టడమేనని ఎయిర్లైన్ ప్రతినిధులు పేర్కొన్నారు. నిందితుడు సెక్యూరిటీ చెకింగ్ను దాటి లైటర్ను విమానంలోకి ఎలా తీసుకువెళ్లగలిగాడనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
నిందితుడిపై కఠిన చర్యలు
విమానం గోవాలోని మోపా ఎయిర్పోర్టులో ల్యాండ్ అయిన వెంటనే.. ఎయిర్లైన్ సిబ్బంది నిందితుడిని స్థానిక పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై ‘భారతీయ న్యాయ సంహిత’ (BNS), ‘సివిల్ ఏవియేషన్ భద్రతకు వ్యతిరేకమైన చట్టవిరుద్ధ చర్యల అణిచివేత చట్టం’ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నట్లు మోపా ఎయిర్పోర్ట్ పోలీసులు తెలిపారు.
ఆకాశ ఎయిర్ వివరణ
ఈ ఘటనను ధ్రువీకరించిన ఆకాశ ఎయిర్, తమ సిబ్బంది భద్రతా ప్రోటోకాల్స్ను పాటించి నిందితుడిని అధికారులకు అప్పగించినట్లు తెలిపింది. ప్రయాణికుల భద్రత విషయంలో ఎటువంటి రాజీ పడబోమని, దర్యాప్తుకు పూర్తి సహకారం అందిస్తామని ఎయిర్లైన్ స్పష్టం చేసింది.


