Andhra Pradesh
oi-Sai Chaitanya
శ్రీవారి భక్తులకు రైల్వే శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. పలు ప్రాంతాల నుంచి తిరుపతికి రాకపోకలు సాగించే ఎనిమిది ప్రధాన రైళ్లల్లో ప్రయాణీకుల కోసం కీలక మార్పులు చేసింది. ఈ నెల 16 నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ రైళ్లల్లో ప్రయాణీకుల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ మేరకు మార్పుల వివరాలను ప్రకటించారు.
తిరుపతికి పలు ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లల్లో మార్పులు జరిగాయి. మూడు దశాబ్దాలుగా తిరుపతి కి రాకపోకలు సాగిస్తున్న ఈ రైళ్ల స్థానంలో కొత్తవి పట్టాలెక్కనున్నాయి. తిరుపతి-పూరి, బిలాస్పూర్ ఎక్స్ప్రెస్, తిరుపతి-రామేశ్వరం ఎక్స్ప్రెస్, అమరావతి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, కాకినాడటౌన్ ఎక్స్ప్రెస్ రైళ్లను ఐసీఎఫ్ నుంచి ఎల్హెచ్బీకి రైల్వేశాఖ మార్చింది. ఈ రైళ్లలో మెరుగైన సదుపాయాలను పొందుపరిచారు. డోర్స్, ఏసీ, ఫ్యాన్స్, లైటింగ్, వాటర్, బాత్రూమ్స్, బ్రేక్సిస్టమ్, స్పీడు, కంట్రోల్, బెర్తు, సీటింగ్ కెపాసిటీ పెంచడం వంటి తాజా సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు. తిరుపతి-పూరి ఎక్స్ప్రెస్ (నెంబర్లు 17480-17479) సోమ, మంగళ, బుధ, శుక్ర, శనివారాలలో నడుస్తాయి.తిరుపతి-బిలా్సపూర్ (నెంబర్లు 17482-17481) గురు, ఆదివారాల్లో మాత్రమే నడుస్తాయి.
ప్రయాణీకుల సౌకర్యార్ధం కొత్త సదుపాయాలతో
కాగా, ఈ నాలుగు నూతన రైళ్లు 18బోగీలతో ఈనెల 16న తిరుపతి నుంచి ఒకటి, అదే రోజున పూరి నుంచి మరొకటి బయల్దేరతాయి. 19న తిరుపతి నుంచి ఒకటి, అదే రోజున బిలా్సపూర్ నుంచి మరొకటి బయల్దేరుతాయి. అదే విధంగా తిరుపతి-అమరావతి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (నెంబర్లు 12765-12766) మొత్తం 15బోగీలతో ఈ నెల 21న తిరుపతి నుంచి బయలు దేరుతుంది. ఈ రైలు వారంలో రెండురోజులు అంటే మంగళ, శనివారాల్లో మాత్రమే నడుస్తుంది. ఇక..తిరుపతి-కాకినాడటౌన్ ఎక్స్ప్రెస్ (నెంబర్లు 17249-17250) మొత్తం 22బోగీలతో ఈ నెల 22న తిరుపతి నుంచి ఒకటి అదే రోజున కాకినాడ నుంచి మరొకటి బయల్దేరతాయి. దీంతో పాటుగా తిరుపతి-రామేశ్వరం ఎక్స్ప్రెస్(నెంబర్లు 16780-16779) మొత్తం 17బోగీలతో ఈనెల 26న రామేశ్వరంలో బయల్దేరి 27న తిరుపతికి చేరుకుంటుంది.ఈ రైలు సోమ, బుధ,శుక్ర, శనివారాల్లో మాత్రమే నడుస్తుంది.


