Andhra Pradesh
oi-Chandrasekhar Rao
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. బుధవారం నాడు 66,606 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 25,899 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.78 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 25 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 నుంచి 15 గంటల సమయం పట్టింది.
కాగా- తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు అలిపిరి వద్ద ఏర్పాటు చేసిన లగేజి డిపాజిట్ కౌంటర్ పనితీరును టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర పరిశీలించారు. సీవీఎస్ఓ కేవీ మురళీకృష్ణతో కలిసి గురువారం తనిఖీలు నిర్వహించారు.
భక్తులు అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లే సమయంలో తమ లగేజిని కౌంటర్లో డిపాజిట్ చేస్తుంటారిక్కడ. ఆ లగేజీని భద్రంగా తిరుమలకు తరలించే విధానానికి సంబంధించిన వివరాలను అధికారులు ఈ సందర్భంగా ఈవోకు వివరించారు. లగేజి డిపాజిట్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా క్యూఆర్ కోడ్తో కూడిన రసీదు భక్తులకు అందజేస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా తిరుమలలో తమ లగేజీని భక్తులు పొందగలుగుతారని వివరించారు.
సాధారణ రోజుల్లో సుమారు 6,000 బ్యాగులు ఇక్కడ డిపాజిట్ అవుతుంటాయి. వారాంతం, ప్రత్యేక రోజులు, పర్వదినాల సమయంలో 10,000 వరకు బ్యాగులను భక్తులు అలిపిరి లగేజీ కౌంటర్ లో డిపాజిట్ చేస్తుంటారని తెలిపారు. వాటన్నింటినీ కూడా ఎటువంటి గందరగోళానికి తావు లేకుండా తిరుమలకు భద్రంగా రవాణా చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అనంతరం ఈవో లగేజి కౌంటర్లో ఏర్పాట్లను ఈఓ పరిశీలించారు. భక్తులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు అధికారులకు పలు సూచనలు చేశారు.


