India
oi-Jakki Mahesh
తమిళ రాజకీయాల్లో ప్రముఖ హీరో, తమిళగ వెట్రి కజగం పార్టీ అధినేత దళపతి విజయ్ తీసుకునే నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీతో విజయ్ పొత్తు పెట్టుకుంటారనే వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.
అసలేం జరుగుతోందంటే?
ఇటీవల పార్టీ జిల్లా కార్యదర్శులతో జరిగిన ఓ వర్చువల్ సమావేశంలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ సమావేశంలో దాదాపు 98 మంది జిల్లా కార్యదర్శులు బీజేపీతో పొత్తుకు సుముఖత వ్యక్తం చేశారని.. విజయ్ ఏ నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని చెప్పారని ప్రచారం జరిగింది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ఉండాలంటే బీజేపీతో కలిసి వెళ్లడం మంచిదని కొందరు కార్యకర్తలు అభిప్రాయపడినట్లు సమాచారం.
అసలు వాస్తవాలు ఇవే..
ఈ వార్తలపై స్పష్టతనిస్టూ టీవీకే పార్టీ అధిష్టానం కీలక ప్రకటన చేసింది. తమిళనాడులో జరగబోయే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. పార్టీ సమన్వయకర్త, కీలక నేతలు మాట్లాడుతూ.. 234 స్థానాల్లోనూ టీవీకే పోటీ చేస్తుందని.. బీజేపీతో పొత్తు గురించి వస్తున్న వార్తలన్నీ అబద్ధాలని కొట్టిపారేశారు. విజయ్ గతంలోనే తన పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని.. తమ పార్టీయే కూటమికి నాయకత్వం వహిస్తుందని స్పష్టం చేసిన విషయాన్ని వారు గుర్తు చేశారు.
బీజేపీ, ఇతర పార్టీల స్పందన
మరోవైపు బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా పొత్తు వార్తలను ఖండించింది. ఎన్డీఏ కూటమిలో తాము బలంగా ఉన్నామని.. విజయ్ పార్టీతో ఎటువంటి చర్చలు జరగలేదని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. విజయ్ ఇప్పటికే బీజేపీని తన సైద్దాంతిక ప్రత్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు ఉన్నట్టుండి ఆ పార్టీతో కలిసి పనిచేస్తారనే వార్తలకు ఎటువంటి ఆధారాలు లేవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు ఉండదని విజయ్ గతంలోనే స్పష్టం చేసినా.. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ఇలాంటి ఊహాగానాలు రావడం సహజమే. అయితే ప్రస్తుతానికి మాత్రం విజయ్ తన పంథాలో తాను వెళ్తూ.. సొంత బలంతోనే ఎన్నికల్లోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ క్యాడర్ను బలోపేతం చేయడంపై విజయ్ ప్రస్తుతం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.


