International
oi-Jakki Mahesh
మధ్యప్రాచ్యంలో ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో ఇప్పుడు మరో ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దశాబ్ధాలుగా ఉద్రిక్తతలకు నిలయమైన అఫ్గానిస్థాన్-పాకిస్థాన్ సరిహద్దులో పరిస్థితి ఒక్కసారిగా పేలుడు పదార్థంలా మారింది. ప్రస్తుతం అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ దేశాల మధ్య సరిహద్దు వివాదాలు తారాస్థాయికి చేరాయి. పాకిస్థాన్ ఇటీవల తమ భూభాగంపై జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా అఫ్గాన్ ఇప్పుడు పాక్ సైనిక్ స్థావరాలను లక్ష్యం చేసుకుని మెరుపు దాడులు చేస్తోంది. ఈ ఘటనతో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.
అసలు ఏం జరిగిందంటే?
పాకిస్థాన్ అఫ్గానిస్థాన్లోని కాబూల్, కందహార్, పక్టియా, పక్టికా ప్రాంతాలపై వైమానిక దాడులు జరిపి పౌరుల ప్రాణాలను బలిగొందని అఫ్గాన్ తాలిబన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనికి బదులుగా అఫ్గాన్ వాయుసేన పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలోని కోహాట్, ఇస్లామాబాద్లోని ఫైజాబాద్ వద్ద ఉన్న ‘హంజా’ అనే కీలక సైనిక కేంద్రంపై దాడులు చేసింది. తాలిబన్ అధికార ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రత్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ దాడుల్లో పాక్ సైనిక వార్ కమాండ్ సెంటర్, గిడ్డంగులు, సైనికుల నివాస ప్రాంతాలకు భారీగా నష్టం వాటిల్లింది. సరిహద్దుల్లోని లక్కీ మర్వత్ జిల్లాలో పోలీసు వాహనంపై జరిగిన ఐఈడీ బాంబు దాడిలో ఏడుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి తామే బాధ్యులమని ‘తహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్’ ప్రకటించింది.
తీవ్రంగా మారుతున్న వివాదం
కందహార్ విమానాశ్రయం సమీపంలోని ‘కమ్ ఎయిర్’ ఇంధన డిపోపై పాకిస్థాన్ బాంబు దాడి చేసిందని తాలిబన్లు ఆరోపించారు. ఈ డిపో ఐక్యరాజ్యసమితి విమానాలకు కూడా ఇంధనాన్ని అందిస్తుందని.. ఇది అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించడమేనని తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మండిపడ్డారు. సుమారు 2600 కిలోమీటర్ల పొడవైన డ్యూరాండ్ లైన్ సరిహద్దు విషయంలో రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా ఘర్షణలు జరుగుతున్నాయి. అఫ్గానిస్థాన్ ఈ సరిహద్దును గుర్తించకపోవడమే ఈ వివాదాలన్నింటికీ మూల కారణం.
ప్రపంచ దేశాల ఆందోళన:
మధ్యప్రాచ్యంలో ఇప్పటికే యుద్ధం కొనసాగుతుండటంతో, ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య కూడా యుద్ధం పెరిగితే ప్రాంతీయ శాంతికి విఘాతం కలుగుతుందని అంతర్జాతీయ వేదికలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్ ఆరోపణలను అఫ్గాన్ ప్రభుత్వం ఖండించగా.. పాకిస్థాన్ మాత్రం అఫ్గాన్ భూభాగం నుంచి తమపై దాడులు జరుగుతున్నాయని వాదిస్తోంది. ఏది ఏమైనా, అఫ్గాన్-పాక్ సరిహద్దులో జరుగుతున్న ఈ పరిణామాలు ఆ ప్రాంతాన్ని మరో యుద్ధ క్షేత్రంగా మార్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెండు దేశాలు సంయమనం పాటించకపోతే.. పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదం ఉంది.


