Telangana
oi-Sai Chaitanya
ముఖ్యమంత్రి రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలతో పాటుగా విద్యార్ధులకు సదుపాయాలు పెంచటం పైన ఫోకస్ చేసారు. పాఠశాలలను అప్ గ్రేడ్ చేయటం పైన కీలక దిశా నిర్దేశం చేసారు. అదే విధంగా విద్యార్థినుల కోసం కొత్త వరాలు ప్రకటించారు. వచ్చే వారం తెలంగాణ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు. అందులో రేవంత్ ప్రభుత్వం వీరి కోసం కొత్త నిర్ణయాల అమలు దిశగా కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి రేవంత్ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ… విద్యా వ్యవస్థను ప్రక్షాళన దిశ గా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా విద్యార్థుల కోసం రవాణా, భోజనం, నూతన విద్యా విధానంపై కీలక హామీలు ఇచ్చారు. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ప్రభుత్వ పాఠ శాల విద్యార్థులకు ఉచితంగా లేదా 50 శాతం రాయితీతో బస్సు రవాణా సౌకర్యాన్ని కల్పించాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు బడ్జెట్ లో ప్రకటించే వీలుగా కసరత్తు జరుగుతోంది. అదే సమయం లో విద్యా వ్యవస్థలోనూ మార్పులు తెస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే చోట విద్యను అందించే విధానాన్ని అమలు చేయనున్నారు. విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుండి కాలేజీ స్థాయి వరకు వేర్వేరు చోట్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఒకే ప్రాంగణంలో చదువుకునేలా ఈ విధానాన్ని రూపొందించారు.
ప్రభుత్వం కొత్త ప్రణాళికలు
కాగా, కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ అత్యాధునిక మౌలిక సదుపాయాలతో పాటు నాణ్యమైన విద్య అందించేలా కసరత్తు జరుగుతోంది. ఇక.. ఈ పబ్లిక్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం పూట పౌష్టికాహారంతో కూడిన టిఫిన్ కూడా ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సంస్కరణ కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్స్ సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. రవాణా సౌకర్యం కల్పించడం వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థినులకు ఉన్నత విద్య మరింత సులభతరం అవుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే వీటి అమలు దిశగా కసరత్తు చేస్తున్న ప్రభుత్వం.. బడ్జెట్ లో కీలక ప్రకటన చేసేందుకు సమాయత్తం అవుతోంది.


