India
oi-Jakki Mahesh
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు ఇండియాలోని వంటిళ్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ ఉద్రిక్తత కారణంగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ అంతరాయం కారణంగా హోటళ్లు , రెస్టారెంట్లు, చిన్నపాటి తినుబండారాల కేంద్రాలు, అనాథ శరణాలయాలు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందరూ వంట గ్యాస్ దొరక్క ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతున్నారు.
గ్యాస్ కొరతతో కట్టెల పొయ్యిల వైపు మొగ్గు
ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ పరిస్థితుల వల్ల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా గణనీయంగా తగ్గింది. దీంతో బెంగళూరు, హైదరాబాద్ వంటి మహానగరాల్లో రెస్టారెంట్లు, వీధి వ్యాపారులు తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ సంప్రదాయ కట్టెల పొయ్యిల వైపు మళ్లుతున్నారు. బెంగళూరులోని శివాజీనగర్ వంటి ప్రాంతాల్లో కలప విక్రయ కేంద్రాలకు డిమాండ్ ఒక్కసారీగా పెరిగింది. హోటల్ యజమానులు వంటగదిని ఆపలేక దొడ్డబల్లాపూర్, తుమకూరు వంటి పొరుగు ప్రాంతాల నుంచి భారీగా కట్టెలను తెప్పించుకుంటున్నారు. డిమాండ్ పెరగడంతో కట్టెల ధరలు కూడా భారీగా పెరిగాయి.
హైదరాబాద్లో పంప్ స్టవ్ల హడావిడి
హైదరాబాద్లో పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. గ్యాస్ సిలిండర్లు దొరక్కపోవడంతో హోటల్ నిర్వాహకులు ఏళ్ల నాటి పాత పంప్ స్టవ్లను దుమ్ము దులిపి బయటకు తీస్తున్నారు. దీంతో నగరంలోని స్టవ్ రిపేర్ షాపులు కస్టమర్లతో కిటకిటలాడుతున్నాయి. అయితే కిరోసిన్ సరఫరా కూడా పరిమితంగా ఉండటంతో చాలా మంది డీజిల్ సహాయంతో నడిచే స్టవ్లను వాడుతున్నారు. ఇది ఓ వైపు ఖర్చుతో కూడుకున్న పని అయినప్పటికీ.. వ్యాపారాన్ని కొనసాగించడానికి మరో మార్గం లేక యజమానులు సతమతమవుతున్నారు.
సేవా సంస్థలపై అదనపు భారం
ఈ గ్యాస్ కొరత సామాన్యులనే కాకుండా అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలను కూడా తీవ్రంగా వేధిస్తోంది. తమిళనాడులోని పలు సేవా సంస్థల్లో సిలిండర్ల స్టాక్ ఖాళీ అవ్వడంతో వందలాది మందికి వంట చేయడం పెను భారంగా మారింది. కట్టెల పొయ్యిలపై వంట చేయడం వల్ల పొగ ఇబ్బందులు కలగడమే కాకుండా, పెరిగిన కట్టెల ధరలు ఆయా సంస్థల బడ్జెట్ను చిన్నాభిన్నం చేస్తున్నాయి. నగరాల్లోని కఠినమైన పొగ నియంత్రణ నిబంధనల మధ్య కట్టెల పొయ్యిలను వాడటం నిర్వాహకులకు సవాలుగా మారింది.
ఒడిశా, కేరళ రాష్ట్రాల్లోని పరిస్థితులు
ఒడిశాలోని పట్టణాల్లో గ్యాస్ ఏజెన్సీల ముందు ప్రజలు గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూస్తున్నారు. సిలిండర్ల డెలివరీలో జాప్యం జరగడంతో గృహిణులు కూడా వంట కోసం కట్టెలపైనే ఆధారపడుతున్నారు. ఇక కేరళలో ఇప్పటికే కొన్ని హోటళ్లు కట్టెల పొయ్యిలను వాడుతుండటంతో అక్కడ ప్రభావం కొంత తక్కువగా ఉన్నా.. ఆధునిక కిచెన్లు ఉన్న రెస్టారెంట్లు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. సరైన పొగ బయటకు వెళ్లే దారి లేకపోవడంతో కట్టెల పొయ్యిలను అమర్చడం వారికి అసాధ్యంగా మారింది.
రెస్టారెంట్ల నిర్వహణలో పెరిగిన కష్టాలు
గ్యాస్ నుంచి కట్టెలకు మారడం అనేది కేవలం ఇంధనం మారడం మాత్రమే కాదు, అది పని వేగాన్ని కూడా తగ్గిస్తోంది. మంటను నిరంతరం పర్యవేక్షించడం, కట్టెలను నిల్వ చేయడానికి అదనపు స్థలం కేటాయించడం యజమానులకు భారంగా మారింది. కొన్ని ప్రత్యేక వంటకాలను కట్టెల పొయ్యిపై తయారు చేయడం కష్టం కావడంతో చాలా హోటళ్లు తమ మెనూలోని ఐటమ్స్ను తగ్గించేశాయి. పెరిగిన కట్టెల ధరలు, నిర్వహణ వ్యయం వల్ల హోటల్ తిండి సామాన్యుడికి మరింత భారం అయ్యే ప్రమాదం ఉంది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు ఓ వైపు ఇంధన ధరలను పెంచుతుంటే, మరోవైపు సరఫరా గొలుసును దెబ్బతీస్తూ సామాన్యుడిని పాతకాలపు పద్ధతుల వైపు నెడుతున్నాయి. కమర్షియల్ గ్యాస్ సరఫరా మళ్లీ సాధారణ స్థితికి వచ్చే వరకు ఈ ‘కట్టెల కష్టాలు’ కొనసాగేలా కనిపిస్తున్నాయి.


