Telangana
oi-Bomma Shivakumar
తెలంగాణలో విచ్చలవిడిగా కల్తీ ఆహార పదార్థాలను విక్రయిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. ఇటీవల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు, కల్తీ పెరుగు గుట్టు రట్టు అయిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గడచిన మూడేళ్లలో 14,312 ఫుడ్ శాంపిల్స్ ను టెస్టింగ్ చేయగా కేవలం 16 లైసెన్సులు మాత్రమే రద్దు చేసినట్లు సమాచారం. అలాగే జీరో క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
అయితే ఇదే విషయంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ట్వీట్ చేశారు. కల్తీ నిర్వాహకులను పట్టుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని అన్నారు. తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు నామమాత్రపు తనిఖీలు చేస్తున్నారని తెలిపారు. నిందితులను శిక్షించడంలో విఫలం అవుతున్నారని ట్వీట్ చేశారు.
ప్రభుత్వ డేటా ప్రకారం ఫుడ్ శాంపిల్ టెస్టులు గణనీయంగా దాదాపు 46 శాతం తగ్గినట్లు తెలిపారు. అలాగే సివిల్ కేసులు కూడా 71 శాతం తగ్గిపోయినట్లు కవిత స్పష్టం చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఒక్కటంటే ఒక్కటి కూడా క్రిమినల్ కేసు నమోదు చేయకపోవడం గమనార్హం అని తెలిపారు. కేవల ఒకే ఒక లైసెన్స్ ను రద్దు చేసి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని ఇతర రాజకీయ పార్టీలు కూడా ఈ విషయంపై పోరాడకపోవడం దురదృష్టకరమని అన్నారు.
The @revanth_anumula government is playing with your health. While food adulteration rises annually, Telangana Food Safety authorities seem indifferent to punishing culprits.
Per official GoI data, sampling dropped by 46% and civil cases by 71% in just one year. Authorities…
— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 14, 2026
ఈ మేరకు ఇటీవల పార్లమెంటులో సభ్యులు అడిగిన ప్రశ్నలకు బదులుగా కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ తీరును రాతపూర్వకంగా తెలియజేసింది. ఈ విషయాలను కవిత తన ట్వీట్ లో ప్రస్తావించారు. ఇక శిక్షలు వేయడంలో, లైసెన్స్ లను రద్దు చేయడంలో తెలంగాణ రాష్ట్రంతో పోలిస్తే కర్నాటక, కేరళ, ఏపీ తదితర రాష్ట్రాలు చాలా ముందున్నట్లు నివేదిక ద్వారా తెలుస్తోంది. ఇక ప్రజల ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించే కల్తీకి పాల్పడితే కఠినమైన జైలు శిక్షలు పడేలా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.


