Telangana
oi-Chandrasekhar Rao
తెలంగాణను దేశంలోనే ఆయిల్ పామ్ ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా మార్చడానికి ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతో, రైతులకు స్థిరమైన, దీర్ఘకాలిక ఆదాయం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా ఆయిల్ పామ్ సాగును విస్తరిస్తున్నట్లు వెల్లడించారు. ఒకసారి నాటిన తర్వాత 25 నుండి 30 సంవత్సరాల పాటు నిరంతరం ఆదాయాన్ని అందిస్తూ, ఆయిల్ పామ్ రైతుల ఆర్థిక భద్రతకు దోహదపడుతుందని అన్నారు.
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో తెలంగాణ ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో రూ. 300 కోట్ల పెట్టుబడితో నిర్మించిన అత్యాధునిక ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ప్లాంట్ ను పరిశీలించారు. ఫ్యాక్టరీ ట్రయల్ రన్ విజయవంతం కావడంతో అధికారులు, సిబ్బందిని మంత్రి అభినందించారు.
ఈ ప్లాంట్ తెలంగాణలో ఆయిల్ పామ్ సాగుకు కొత్త శకానికి నాంది పలుకుతుందని తుమ్మల పేర్కొన్నారు. అధునాతన మలేషియా సాంకేతికతతో నిర్మించిన ఈ కర్మాగారం, దేశంలోనే అత్యంత ఆధునిక ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్లలో ఒకటి. గంటకు 30 నుండి 120 టన్నుల ఆయిల్ పామ్ తాజా పండ్ల గెలలను ప్రాసెస్ చేసే సామర్థ్యం దీని సొంతం. ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఈ ప్రాజెక్టును మొదలుపెట్టి, రికార్డు స్థాయిలో కేవలం 18 నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేసిందని మంత్రి తుమ్మల తెలిపారు.
త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కర్మాగారాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. నర్మెట్ట ఫ్యాక్టరీలో క్రూడ్ పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్ ఉత్పత్తి సౌకర్యాలు ఉన్నాయి. దీంతో పాటు 4-మెగావాట్ల బయో-పవర్ ప్లాంట్, జీరో-లిక్విడ్ డిశ్చార్జ్ వ్యవస్థ కింద పనిచేసే వాటర్ ట్రీట్మెంట్ సదుపాయం కూడా ఇక్కడ ఉంది. ఆయిల్ ఉత్పత్తి ప్రక్రియలో ఏర్పడే వ్యర్థాలను విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు.
ప్రస్తుతం రైతులు అధికంగా వరి సాగుపై ఆధారపడుతున్నందున పంటల వైవిధ్యీకరణ అవసరమని మంత్రి తుమ్మల అన్నారు. ప్రభుత్వ విధానాలు, సన్నరకం ధాన్యంపై బోనస్ వంటి ప్రోత్సాహకాలతో తెలంగాణ దేశంలోనే ప్రముఖ వరి ఉత్పత్తి రాష్ట్రాల్లో ఒకటిగా అవతరించిందని, కేంద్ర ప్రభుత్వం విధించిన కొనుగోలు పరిమితుల దృష్ట్యా, రైతులు ఉద్యాన పంటలు, కూరగాయలు, ఆయిల్ పామ్ వంటి వాణిజ్య పంటలపై కూడా దృష్టి సారించాలని సూచించారు.
ఆయిల్ పామ్ తోటల్లో కోకో, జాజికాయ, మకాడమియా వంటి అంతర పంటలను సాగు చేసుకోవడం ద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చని మంత్రి వివరించారు. తాజా పండ్ల గెలలను కర్మాగారానికి విక్రయించిన మూడు రోజుల్లోనే డబ్బులు రైతుల ఖాతాలకు జమ అయ్యే మార్కెటింగ్ సౌకర్యం కూడా ఆయిల్ పామ్ కు ఉందని ఆయన తెలిపారు. ఇతర పంటలతో పోలిస్తే, ఆయిల్ పామ్ పంటలకు కోెతులు, అడవి పందుల బెడద తక్కువని, ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల కలిగే నష్టాలు తక్కువని కూడా మంత్రి తుమ్మల పేర్కొన్నారు.
ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడానికి, రైతులకు రూ. 50,921 వరకు సబ్సిడీలు, మొక్కలు ఉచితంగా సరఫరా చేయడంతో పాటు డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను అందిస్తోన్నామని తుమ్మల తెలిపారు. గతంలో ఆయిల్ పామ్ ధర టన్నుకు సుమారు రూ. 12,000గా ఉండగా, ఇప్పుడు టన్నుకు రూ. 21,546కి చేరిందని మంత్రి వివరించారు. దీనిని టన్నుకు రూ. 25,000కి పెంచాలని ప్రధానమంత్రిని కోరామని చెప్పారు.


