India
oi-Syed Ahmed
ఈ ఏడాది దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు (five state election 2026) జరగబోతున్నాయి. ఇందులో తమిళనాడు, పశ్చిమబెంగాల్ వంటి పెద్ద రాష్ట్రాలతో పాటు కేరళ, అసోం, పుదుచ్చేరి కూడా ఉన్నాయి. ఆయా అసెంబ్లీలకు గడువు ముగుస్తుండటంతో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ షెడ్యూల్ రిలీజ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో అయా రాష్ట్రాల్లో ఓటర్ల తీర్పు ఎలా ఉంది, సీట్లు, ఓట్ల శాతం ఎంత, ఈసారి ఏమైనా మార్పు ఉండబోతోందా లేదా చూద్దాం..
తమిళనాడులో (five state election)
తమిళనాడులో 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు డీఎంకే కూటమివైపు ఏకపక్షంగా మొగ్గారు. దీంతో 234 సీట్లు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే కూటమి 53 శాతం ఓట్లతో 159 సీట్లు గెల్చుకుంది. అన్నా డీఎంకే కూటమికి 25 శాతం ఓట్లతో 75 సీట్లు దక్కాయి. బీజేపీ ఒక్క శాతం ఓట్లో నాలుగు స్ధానాల్లో గెలిచింది. డీఎంకే కూటమిలో భాగమైన కాంగ్రెస్ 6 శాతం ఓట్లతో 18 సీట్లు గెల్చుకుంది. ఈ కూటమిలో డీఎంకే, కాంగ్రెస్ మినహా మిగిలిన పార్టీలు 13 శాతం ఓట్ల శాతంతో 38 సీట్లు గెలిచాయి. ఈసారి మాత్రం విజయ్ ఎంట్రీతో పరిస్ధితిలో మార్పు రావచ్చనే అంచనాలు ఉన్నాయి. బీజేపీతో విజయ్ పొత్తు పెట్టుకుంటే కచ్చితంగా ఫలితాలు రివర్స్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.
పుదుచ్చేరిలో
కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీకి 2021లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 30 సీట్లకు గానూ.. బీజేపీ దాని మిత్రపక్షాలు 53 శాతం ఓట్లతో 16 సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు 30 శాతం ఓట్లతో 9 సీట్లకే పరిమితమయ్యాయి. ఇతరులు 17 శాతం ఓట్లతో 5 సీట్లు దక్కించుకున్నారు. ఈసారి ఇక్కడ కాంగ్రెస్, మిత్రపక్షాలకు మొగ్గు ఉంటుందని పలు సర్వేలు చెప్తున్నాయి. తమిళనాడు ప్రభావం ఎక్కువగా ఉండే ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో గతంలో మాత్రం అది కనిపించలేదు.
కేరళలో
గతంలో కేరళగా ఉంటూ 2021 అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కొన్న రాష్టం ఈసారి మాత్రం కేరళంగా మారింది. 2021 ఎన్నికల్లో కేరళలోని 140 సీట్లలో ఎల్టీఎఫ్ కూటమి 71 శాతం ఓట్లతో 99 సీట్లు సాధించి వరుసగా రెండోసారి అధికారం అందుకుంది. అలాగే విపక్ష యూడీఎఫ్ 29 శాతం ఓట్లతో 41 సీట్లకే పరిమితమైంది. ఈసారి మాత్రం యూడీఎఫ్ కు అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న ఎల్టీఎఫ్ కూటమి ప్రజావ్యతిరేకతను ఎంతమేరకు తట్టుకుని నిలబడుతుందన్న దానిపై ఫలితాలు ఆధారపడి ఉంటాయి.
పశ్చిమబెంగాల్లో
పశ్చిమ బెంగాల్లో 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 294 సీట్లకు గానూ తృణమూల్ కాంగ్రెస్ ఏకంగా 73 శాతం ఓట్లతో 215 సీట్లు సాధించి హ్యాట్రిక్ రికార్డు సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో బీజేపీ 23 శాతం ఓట్లతో 77 సీట్లు మాత్రమే సాధించి సరిపెట్టుకుంది. ఐఎస్ఎఫ్, ఇతరులు తలో సీటు సాధించారు. కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఈసారి కూడా ఇక్కడ తృణమూల్ హవా ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. బీజేపీ గట్టి పోటీ ఇచ్చినా అధికారం చేపట్టడం కష్టంగానే కనిపిస్తోంది.
అసోంలో
ఈశాన్య రాష్ట్రమైన అసోంలో 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 126 సీట్లకు గానూ బీజేపీ, మిత్రపక్షాలు 52 శాతం ఓట్లతో 75 సీట్లు దక్కించుకున్నాయి. కాంగ్రెస్, మిత్రపక్షాలు 35 శాతం ఓట్లతో 50 సీట్లు దక్కించుకున్నాయి. స్థానిక ఏఐయూడీఎఫ్ 11 శాతం ఓట్లతో 16 సీట్లు గెల్చుకుంది. ఇతరులు 2 శాతం ఓట్లతో 3 సీట్లు దక్కించుకున్నారు. ఈసారి కూడా పరిస్దితిలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చనే అంచనాలున్నాయి. బీజేపీకి కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ లభిస్తున్నా అధికారం మాత్రం కష్టమే అంటున్నారు.


