Andhra Pradesh
oi-Dr Veena Srinivas
పుంగనూరులో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పుంగనూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో బైక్ నుంచి వచ్చిన పొగను పీల్చుకొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలైన ఘటన స్థానికంగా కలకలం రేపింది . పుంగనూరు పట్టణంలో విషాద ఛాయలు అలముకునేలా చేసింది.
పొగ పీల్చి నలుగురు మృతి
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ దుర్ఘటనలో మృతిచెందిన వారిని తాతా-మనవడు, ఇద్దరు మనవరాళ్ళుగా పోలీసులు గుర్తించారు. కుటుంబ సభ్యులందరూ రాత్రి సమయంలో నిద్ర పోతూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలను చూసినట్లయితే ఇంట్లో బైక్ సర్వీసింగ్ నిర్వహించి ఆ తరువాత ఇంజన్ ఆన్ లోనే ఉంచి కుటుంబమంతా పడుకున్నారు.
రాత్రంతా బైక్ ఆన్ లోనే.. పొగతో దుర్మరణం
రాత్రంతా బైక్ ఇంజన్ ఆన్ లో ఉండడంతో గదిలోకి భారీగా పొగ వ్యాపించడంతో ఈ పొగను పీల్చి నిద్రిస్తున్న కుటుంబ సభ్యులకు ఊపిరాడక మృతి చెందారు. బైక్ పొగలో ఉండే విషపూరిత వాయువులు శ్వాసకోశంలోకి వెళ్లడంతో ఒక్కొక్కరుగా స్పృహ కోల్పోయి అపస్మారకస్థితికి చేరుకుని మరణించారు. ఉదయం వరకు గది తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన పక్కింటి వాళ్ళు ఇంటి వద్దకు వెళ్లి చూసేసరికి నలుగురు మృతి చెందిన విషాదదృశ్యం కనిపించింది.
బైక్ ఇంజన్ నుంచి వెలువడిన పొగలో కార్బన్ మోనాక్సైడ్
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన ప్రాథమిక విచారణలో బైక్ ఇంజన్ నుంచి వెలువడిన పొగలోని కార్బన్ మోనాక్సైడ్ వంటి విషవాయువుల కారణంగా నలుగురు అపస్మారక స్థితిలోకి చేరుకుని మృతి చెంది ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఊహించని కారణంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
మూసివేసిన గదిలో వాహనాన్ని ఆన్ చేసి పెట్టడం వల్ల, దాంతో గదంతా పొగ వ్యాపించి ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఊహించని కారణంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా విషాదాన్ని కలిగించింది. కనుక ఇలాంటి విషయాలలో నిర్లక్ష్యంగా ఉండొద్దు.


