International
oi-Bomma Shivakumar
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇరాన్, ఇజ్రాయెల్- అమెరికా పరస్పర దాడులతో విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ లోని మిలిటరీ సదుపాయాలు, చమురు కేంద్రాలే టార్గెట్ గా ఇజ్రాయెల్, అమెరికా దాడులను కొనసాగిస్తున్నాయి. అటు ఇరాన్ సైతం ఏమాత్రం వెనక్కు తగ్గకుండా ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ మిలిటరీ స్థావరాలను ధ్వంసం చేస్తోంది. ఈ నేపథ్యంలో CBSE బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
స్థానికంగా ఉన్న ఉద్రిక్త వాతావరణం దృష్ట్యా పశ్చిమాసియాలోని దేశాలు, గల్ఫ్ దేశాల్లో ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మార్చి 15న సర్క్యూలర్ జారీ చేసింది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 10 మధ్య ఇంటర్ పరీక్షలను CBSE నిర్వహించాల్సి ఉండగా పశ్చిమాసియాలో తలెత్తిన యుద్ధ వాతావరణం కారణంగా పరీక్షలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు CBSE గుర్తింపు పొందిన బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా అలాగే యూఏఈ లోని పాఠశాలల్లో ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది.
ఇంతకుముందు ఇంటర్ పరీక్షలకు సంబంధించిన కొన్ని పరీక్షలను సీబీఎస్ఈ రద్దు చేసిన విషయం తెలిసిందే. మార్చి 1, 3, 5 తేదీల్లో ఈ పరీక్షలకు సంబంధించిన సర్క్యూలర్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జారీ చేసిన సర్క్యూలర్ ప్రకారం ఆ పరీక్షలపై ఉన్న రద్దు అంశం అలాగే కొనసాగుతుందని తాజాగా సీబీఎస్ఈ స్పష్టం చేసింది. ఈ మేరకు సీబీఎస్ఈ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సన్యమ్ భరద్వాజ్ పేర్కొన్నారు.
పరీక్షలు రద్దు అయిన దేశాల్లో త్వరలోనే కొత్త తేదీలు ప్రకటిస్తామని.. ఆ తర్వాత ఫలితాల కోసం ప్రత్యేక తేదీలను కేటాయిస్తామని బోర్డు స్పష్టం చేసింది. అయితే తాజాగా సీబీఎస్ఈ బోర్డు తీసుకున్న నిర్ణయం గల్ఫ్ దేశాల్లోని అనేకమంది విద్యార్థులపై ప్రభావం పడనుంది. అయితే విద్యార్థుల భద్రత దృష్ట్యా బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అలాగే మార్చి 5 న పశ్చిమాసియా దేశాల్లో పదో తరగతి పరీక్షలపై సీబీఎస్ఈ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా దాడుల నేపథ్యంలో పశ్చిమాసియా దేశాల్లో పదో తరగతి వార్షిక పరీక్షలను రద్దు చేస్తూ సీబీఎస్ఈ నిర్ణయం తీసుకుంది. బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్ దేశాల్లో సీబీఎస్ఈ పరీక్షల్ని రద్దు చేసింది. అలాగే ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈలోనూ సీబీఎస్ఈ పదోతరగతి పరీక్షలు రద్దు అయ్యాయి. ఇక పశ్చిమాసియా దేశాల్లోని పదో తరగతి విద్యార్థుల ఫలితాలను విడిగా ప్రకటిస్తామని బోర్డు తెలిపింది.


