Telangana
oi-Sai Chaitanya
సీఎం రేవంత్ మరో ఎన్నికల హామీ అమలు దిశగా కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ఏర్పాటు అయిన తరువాత వరుసగా పథకాలను అందిస్తున్నారు. ఇప్పుడు, పెండింగ్ లో ఉన్న రెండు పథకాలను అమలుకు సిద్దమవుతున్నారు. మహిళలకు రూ 2, 500, పెన్షన్లు 4 వేలకు పెంపు పైన ప్రకటన కు తుది కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు రేపు (సోమవారం) నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశ పెట్టే బడ్జెట్ లో ప్రకటన దిశగా చర్చలు సాగుతున్నట్లు సమాచారం.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి(సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావే శాలు ఉదయం 11:45 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ సారి అసెంబ్లీకి కొత్త గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తొలిసారి రానున్నారు. గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. పదిరోజుల పాటు సమావేశాలను నిర్వహించాలనే యోచనలో రేవంత్రెడ్డి ప్రభుత్వం ఉంది. సభ ప్రాంగణంలో రేపు(సోమవారం) తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ పై ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో శాఖలవారీగా ప్రీ బడ్జెట్ సమావేశాలను పూర్తి చేశారు. అన్ని శాఖల మంత్రులు, అధికారులతో మంత్రి భట్టి విక్రమార్క సమీక్షలు నిర్వహించారు. ఈసారి బడ్జెట్లో సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. రైతు సంక్షేమం, మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి వంటి ఆరు గ్యారంటీల అమలుకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. పెండింగ్ హామీల అమలుకు నిధుల కేటాయింపు అధికారంలోకి వచ్చి రెండున్నారేళ్లు పూర్తి కానుండటంతో… ప్రభుత్వం పెండింగ్ హామీల అమలు దిశగా కసరత్తు చేస్తోంది.
పెండింగ్ హామీల అమలు పై బడ్జెట్ లో స్పష్టత
అందులో భాగంగా వచ్చే ఆర్దిక సంవత్సరం నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ 2, 500 .. అదే విధంగా పెన్షన్ రూ 4,000 కు పెంపు పైన ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా.. కొత్త సంక్షేమ పథకాలు, నీటిపారుదల, మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో పెన్షన్ల విషయంలో కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ కేబినెట్లో బడ్జెట్ సమావేశాలపై అధికారిక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సంక్రాంతి సమయంలోనే ఈ రెండు పథకాల అమలు పైన ప్రకటన ఉంటుందని భావించారు. అయితే, ఆర్దిక పరిస్థితుల కారణంగా ఆలస్యం అయింది. త్వరలో జెడ్పీ ఎన్నికలతో పాటుగా మూడు కార్పోరేషన్లు గా విభజించిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో… సంక్షేమంతో పాటుగా పెండింగ్ హామీల అమలు పైన బడ్జెట్ లో ప్రకటన చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ నేపథ్యం లో బడ్జెట్ పైన రాజకీయంగానూ ఆసక్తి నెలకొంది.


