Andhra Pradesh
oi-Syed Ahmed
ఏపీలో గత కొద్ది రోజులుగా ఎల్పీజీ (LPG) గ్యాస్ కొరత కనిపిస్తోంది. హోటల్స్, రెస్టారెంట్లు గ్యాస్ కొరత నేపథ్యంలో రేట్లు పెంచేస్తున్నాయి. దీంతో ప్రజలు ఎక్కడికక్కడ సతమతం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ మరోసారి రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదని, నాలుగు రోజులకు తగ్గ నిల్వలు ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రంలో వంట గ్యాస్ విషయంలో వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌరసరఫరాల శాఖ కమీషనర్ సౌరవ్ గౌర్ స్పష్టం చేశారు. ప్రభుత్వాలు వంటగ్యాస్ సరఫరాకు ఆటంకం లేకుండా అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఎల్పీజీ కనెక్షన్లు 161.19 లక్షలు ఉన్నాయని, వాటిలో ఇండేన్ గ్యాస్ 56.86 లక్షలు, హెచ్ పీ 74.11 లక్షలు, భారత్ గ్యాస్ 30.22 లక్షలు ఉన్నాయన్నారు. రోజువారీ ఎల్పీజీ అవసరం 4,000 మెట్రిక్ టన్నులని తెలిపారు. ఈ నెల 15వ తేది అనగా ఆదివారం నాటికి మొత్తం ఎల్పీజీ స్టాక్ లభ్యత 15,699 మెట్రిక్ టన్నులు ఉందన్నారు. అంటే ఇది దాదాపు నాలుగు రోజులకు సరిపోతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి నియంత్రణలో ఉందని సౌరవ్ గౌర్ తెలిపారు.
సోషల్ మీడియాల్లో వినియోగదారులను కొందరు తప్పుదారి పట్టిస్తున్నారని, నిరాధారమైన ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డాు. వంట గ్యాస్ దుర్వినియోగం నిరోధించడానికి ఓటీపీ ఆధారిత డెలివరీ అమలు చేస్తున్నట్లు తెలిపారు. పెండింగ్ బుకింగ్స్ పర్యవేక్షణ డిస్ట్రిబ్యూటర్ వారీగా, మార్కెట్ వారీగా, జిల్లా వారీగా, సేల్స్ ఏరియా వారీగా, ప్రాంతం-వారీగా ఎప్పటి కప్పుడు చేస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గృహ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి పరిశ్రమలకు బల్క్ ఎల్పీజీ సరఫరా నిలిపివేశామన్నారు. ఆసుపత్రులు, హాస్టల్స్, ప్రభుత్వ సేవలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.


