India
oi-Sai Chaitanya
పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బెంగాల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే ఎన్నికల సంఘం ఇక్కడి పరిస్థితుల పైన ఫోకస్ చేసింది. ఇక్కడ ఈ సారి బీజేపీ – టీఎంసీ మధ్య పోరు హోరా హోరీగా మారుతోంది. మమతా తిరిగి అధికారం నిల బెట్టుకొనేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. బీజేపీ సైతం అవకాశం సద్వినియోగం చేసుకోవా లనే లక్ష్యంతో ఉంది. కాగా.. షెడ్యూల్ విడుదలైన కొద్ది గంటల్లోనే ఈసీ తీసుకున్న నిర్ణయాలు సంచలనంగా మారుతున్నాయి.
పశ్చిమ బెంగాల్ లో ఈ సారి అధికారం మమత ప్రతిష్ఠకు.. సమర్థతకు పరీక్షగా మారుతోంది. గత ఎన్నికల సమయం నుంచే బీజేపీ -మమత మధ్య నువ్వా నేనా అన్నట్లుగా రాజకీయ సమరం సాగుతోంది. ఇక, ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ముందు నుంచి అందరూ అయిదు లేదా ఆరు విడతల్లో పోలింగ్ జరుగుతుందని అంచనా వేసారు. రెండు విడతల్లోనే పోలింగ్ పూర్తి చేసేందుకు ఎన్నికల సంఘం డిసైడ్ అయింది. అందులో భాగంగా షెడ్యూల్ విడదుల చేస్తూనే. ఎన్నికల సంఘం మమతా అధికార టీం పైన చర్యలు మొదలు పెట్టింది. ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీపై వేటు వేసింది. ప్రస్తుతం ఉన్న సీఎస్ నందిని చక్రవర్తిని ఆ బాధ్యతల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల విధులకు ఆమెను దూరంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త సీఎస్గా దష్యంత్ నరియాలను నియమించింది. మరోవైపు హోం శాఖ కార్యదర్శిపైనా బదిలీ వేటు వేసింది. అదే విధంగా పోలీసు అధికారుల్లోనూ కొందరి పైన వేటు దిశగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
హోరా హోరీ పోరు వేళ వ్యూహాత్మక నిర్ణయాలు
ఇక, రాజకీయంగా బెంగాల్ లో ప్రధాని మోదీ- మమతా మధ్య మరోసారి రాజకీయ యుద్దం ఖాయం గా కనిపిస్తోంది. ఇప్పటికే షెడ్యూల్ వేళ మమతా అటు ఉద్యోగులతో సహా పలు వర్గాలను ఆకట్టు కొనే విధంగా కీలక వరాలు ప్రకటించారు. షెడ్యూల్ విడుదల వరకు ఎన్నికల సంఘం నిర్ణయాల పైన మమతా ఆరోపణలు చేస్తూనే వచ్చారు. ఇక.. ఇతర రాష్ట్రాల కంటే బీజేపీ నాయకత్వానికి ఈ రాష్ట్రం మరింత కీలకంగా మారుతోంది. ఇక్కడ అధికారం దక్కించుకోవాలనే కమల నాధుల సుదీర్ఘ కల. మమతా లక్ష్యంగా ప్రధాని మోదీ తన ప్రచారంలో కీలక వ్యాఖ్యలు చేసారు. హోం మంత్రి అమిత్ షా ఇక్కడ ఎన్నికల వ్యూహాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని మోదీ సైతం ఎక్కువగా బెంగాల్ లో ప్రచార సభలకు సిద్దం అవుతున్నారు. దీంతో.. ఇక్కడ ఎన్నికల నిర్వహణ ఈసీకి సున్నితంగా మారుతోంది. ఈ క్రమంలో ఈసీ తీసుకుంటున్న నిర్ణయాలతో.. రానున్న రోజుల్లో ఎలాంటి రాజకీయం చోటు చేసుకుంటుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.


