Andhra Pradesh
oi-Sai Chaitanya
మండుతున్న ఎండల వేళ వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఏపీ, తెలంగాణలో రానున్న ఆరు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. నేటి నుంచి ఈనెల 21 మధ్య కురుస్తాయని అధికారులు తెలిపారు. మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ఒక ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావం వల్లనే ఈ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు వెల్లడించారు. 40 డిగ్రీలకు చేరుకున్న గరిష్ఠ ఉష్ణోగ్రతల నుంచి ఈనెల 21 వరకు ప్రజలకు ఈ వర్షాలతో కొంత మేర రిలీఫ్ దక్కే అవకాశం కనిపిస్తోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరిగింది. అదే సమయంలో తీవ్ర ఉక్కపోత కారణంగా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తెలంగాణలో వచ్చే ఆరు రోజుల పాటు అంటే.. మార్చి 16 నుంచి 21వ తేదీ వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, హైదరాబాద్, నల్గొండ జిల్లాల్లో మొదలై మంగళ, బుధవారాల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మరికొన్ని ప్రాంతాలకు ఈ భారీ వర్షాలు విస్తరిస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ఎల్లో అలర్ట్ను వాతావరణ శాఖ జారీ చేసింది. దాంతో మార్చి 21వ తేదీ వరకు రాష్ట్రంలో ఎండల తీవ్రత తగ్గుతుందని స్పష్టం చేసింది. మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతుందని వివరించింది. అందువల్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరాలను వెల్లడించింది.
ఏపీలోని ఈ జిల్లాలకు వర్షాల పై అలర్ట్స్
కాగా, ఇక ఏపీలోనూ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంది. అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమలతోపాటు ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రైతులు కోతకు సిద్ధంగా ఉన్న పంటలు, ఆరబోసిన ధాన్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పిడుగులు పడే అవకాశం ఉన్నందున వర్షం కురిసే సమయంలో చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల వద్ద ఉండవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.


