India
oi-Korivi Jayakumar
కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం.. రెప్పపాటు ఈ జీవన ప్రయాణం క్షణికం అంటుంటారు. అందుకే జీవితంలో అత్యంత బాధాకరమైన క్షణం ఒక మనిషి తన ప్రియమైన వ్యక్తికి చివరి వీడ్కోలు చెప్పే సమయం. అలాంటి సమయంలో కూడా ఇబ్బందులు ఎదురైతే కుటుంబాల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కేరళలోని Kozhikodeలో ఇదే పరిస్థితి ఎదురైంది. కోజికోడ్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న Smrithipatham Crematoriumలో గ్యాస్ సిలిండర్ల నిల్వలు పూర్తిగా అయిపోవడంతో గ్యాస్ ఆధారిత దహన సంస్కారాలను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో అంతిమయాత్రకు వచ్చిన కుటుంబాలు మరిన్ని కష్టాలు ఎదుర్కొంటున్నాయి.
మృతదేహంతో వేచి చూస్తున్న కుటుంబాలు..
స్మృతిపథం స్మశానవాటికలో అంతిమ సంస్కారాల ఖర్చు ఇతర ప్రాంతాల కంటే తక్కువగా ఉంటుంది. గ్యాస్ ఆధారిత దహనానికి సుమారు ₹2,000, ఎలక్ట్రిక్ విధానానికి ₹2,500 వసూలు చేస్తారు. అందుకే ఆర్థికంగా బలహీన వర్గాలకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అయితే గ్యాస్ సిలిండర్ల సరఫరా కొరతతో కొందరు కుటుంబాలు తమ బంధువుల మృతదేహాలతో గంటల తరబడి ఎదురు చూసే పరిస్థితి ఎదురవుతోంది. సరఫరాదారులను పలుమార్లు సంప్రదించినా కొత్త స్టాక్ రాలేదని స్మశానవాటిక సిబ్బంది చెబుతున్నారని వాపోతున్నారు. దీంతో గ్యాస్ ఫర్నేస్లు పనిచేయకపోవడంతో అధికారులు వాటిని తాత్కాలికంగా మూసివేశారు.
గ్యాస్ ఫర్నేస్లు నిలిచిపోవడంతో ప్రస్తుతం సంప్రదాయ పద్ధతులే శరణ్యంగా మారాయి. కొబ్బరి పీచు, కొబ్బరి చిప్పలు, కట్టెలు ఉపయోగిస్తూ దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ ఎక్కువ సమయం పడుతుందని.. అయినప్పటికీ తమ బంధువులకు చివరి వీడ్కోలు ఇవ్వాలని కుటుంబాలు ఈ విధానాన్నే అంగీకరించాల్సి వస్తోంది. ఈ స్మశానవాటికలో ఎలక్ట్రిక్ క్రీమెటోరియం కూడా ఉంది. కానీ అది సాంకేతిక కారణాలతో గత నాలుగు నెలలుగా పనిచేయడం లేదు. అది పనిచేసి ఉంటే ఇప్పటి పరిస్థితి కొంతవరకు సులభమయ్యేదని స్థానికులు అంటున్నారు. అధికారులు మాత్రం వారం రోజుల్లో మరమ్మతులు పూర్తి చేస్తామని చెబుతున్నారు.
ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి..
గ్యాస్ కొరత కారణంగా ఇప్పుడు కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ముఖ్యంగా Puthiyapalam లేదా West Hill ప్రాంతాల్లోని స్మశానవాటికలను ఆశ్రయిస్తున్నారు. మృతదేహాన్ని తరలించడం, కొత్త ఏర్పాట్లు చేయడం వల్ల కుటుంబాలు మరింత కష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఇతర ప్రాంతాల్లో అంతిమ సంస్కారాలు నిర్వహించాల్సి రావడంతో ఒక్కో కుటుంబంపై ₹500 నుంచి ₹1,500 వరకు అదనపు ఖర్చు పడుతోంది. ఇప్పటికే బాధలో ఉన్న కుటుంబాలకు ఇది మరొక భారంగా మారింది.
గ్యాస్ ఫర్నేస్ ద్వారా ఒక మృతదేహాన్ని దహనం చేయడానికి సుమారు 25 కిలోల గ్యాస్ అవసరం అవుతుంది. అంటే దాదాపు ఒకటిన్నర కమర్షియల్ సిలిండర్లు ఖర్చవుతాయి. ఫర్నేస్ సరైన ఒత్తిడితో పనిచేయాలంటే ఒకేసారి సుమారు 12 సిలిండర్లను కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా గ్యాస్ ఫర్నేస్లతో పని చేయడం సులభం. కానీ సంప్రదాయ పద్ధతిలో దహనం చేయడం చాలా కష్టమైన పని. అయినప్పటికీ కుటుంబాల భావోద్వేగాలను అర్థం చేసుకుని సేవలు అందించేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారు.
గ్యాస్ సరఫరా తిరిగి సాధారణ స్థితికి చేరుకున్న వెంటనే గ్యాస్ ఆధారిత దహన సంస్కారాలను పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. అలాగే ఎలక్ట్రిక్ క్రీమెటోరియం మరమ్మతులను కూడా త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. ఈ ఘటన ఒక చిన్న కొరత కూడా ఎంత పెద్ద సమస్యగా మారుతుందో చూపిస్తోంది. జీవితం ముగిసిన తరువాత కూడా ప్రశాంతంగా వీడ్కోలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడటం కుటుంబాలను మరింత కలచివేస్తోంది.


