Andhra Pradesh
oi-Dr Veena Srinivas
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూ విశాఖపట్నం వేగంగా దూసుకుపోతోంది. అంతర్జాతీయ సంస్థలు విశాఖపైన ఆసక్తి చూపడంతో ఏపీ ప్రభుత్వం విశాఖలో మౌలిక సదుపాయాల కల్పనపైన ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే విశాఖకు మెట్రోరైలు, సెమీ రింగ్ రోడ్డు, నగర రహదారుల విస్తరణ వంటి అనేక పనులను చేపడుతోంది. ఈ పరిణామాల మధ్య విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి తాజాగా ఒక శుభవార్తను చెప్పారు మంత్రి నారాయణ.
మెట్రో ప్రాజెక్ట్ లపై మంత్రి నారాయణ శుభవార్త
ఈ ప్రాజెక్టుకు ఉగాదికి ముందే రెండు మూడు రోజులలో కేంద్రం నుంచి అనుమతులు లభిస్తాయని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం విశాఖ మెట్రో ప్రాజెక్ట్ కేంద్ర పరిశీలనలో ఉందని, రైడర్స్ సంస్థ దీనిపైన అధ్యయనం చేస్తోందని పేర్కొన్నారు. ఇది మరో రెండు నెలలలో పూర్తయ్యే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ఈ అధ్యయనం తర్వాత మెట్రో నిర్మాణం కోసం టెండర్లను కూడా త్వరలోనే పిలుస్తామని మంత్రి నారాయణ గుడ్ న్యూస్ చెప్పారు.
మూడేళ్ళలో పూర్తి చేసే లక్ష్యంతో విశాఖ మెట్రో నిర్మాణం
పట్టణ గృహ నిర్మాణ శాఖ పై జరిగిన ప్రాంతీయ సదస్సులో ఈ కీలక విషయాన్ని చెప్పిన మంత్రి నారాయణ, కేంద్రం నుంచి అనుమతులు లభిస్తే విశాఖ మెట్రో ప్రాజెక్ట్ మూడేళ్లలో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు. విశాఖ మెట్రో తొలిదశలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుండి కొమ్మాది వరకు 46.8 మూడు కిలోమీటర్ల మార్గాన్ని నిర్మించనున్నారు.
డబుల్ డెక్కర్ విధానంలో విశాఖ మెట్రో
మొత్తం ఈ ప్రాజెక్టులో మూడు ప్రధాన కారిడార్లను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ నుండి కొమ్మాది వరకు ఒక కారిడార్, ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ నుండి గురుద్వారా వరకు రెండో కారిడార్, చిన్న వాల్తేరు నుండి తాటిచెట్లపాలెం వరకు మూడో కారిడార్.. ఇలా మూడు కారిడార్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. డబల్ డెక్కర్ విధానంలో మెట్రో రైలు మార్గాన్ని నిర్మిస్తారు.
విశాఖ మెట్రో డి పి ఆర్ కు కేంద్ర అనుమతులు ఇస్తే పనులు మొదలు
మొత్తం 46.23 కిలోమీటర్ల మార్గంలో, 20.16 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ మార్గం నిర్మాణం జరుగుతుంది. ఇది ప్రాజెక్టులో దాదాపు సగం దూరం డబుల్ డెక్కర్ వ్యవస్థలోనే ఉంటుందని తెలియజేస్తుంది. ఇదిలా ఉంటే విశాఖ మెట్రో డి పి ఆర్ కు కేంద్ర అనుమతులు ఇస్తే, ఆ తర్వాత టెండర్లు పిలిచి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని మంత్రి నారాయణ తెలిపారు.
విజయవాడ మెట్రో సర్వే చేపట్టి డిపిఆర్ ను సిద్ధం చేసి మళ్లీ కేంద్రానికి
మరోవైపు విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం లభించింది. దీనికి త్వరలోనే సర్వే చేపట్టి డిపిఆర్ ను సిద్ధం చేసి మళ్లీ కేంద్రానికి ఆమోదం కోసం పంపుతారు. ఏది ఏమైనా ఏపీలో మెట్రో రైళ్ల వ్యవస్థ కోసం కేంద్రం సానుకూలంగా స్పందించడం ఏపీ పురోగతికి కారణమవుతుంది.


