India
oi-Bomma Shivakumar
బెంగాల్ లో ఎన్నికల నగారా మోగింది. ఎలక్షన్ కమిషన్ ఎన్నికల తేదీని ప్రకటించిన మరుసటి రోజే బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను రిలీజ్ చేసింది. 144 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర, దక్షిణ బెంగాల్ లోని పలు కీలక నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నియోజకవర్గం అయిన భవానీ పూర్ నుంచి రాష్ట్ర ప్రతిపక్షనేత సువేంధు అధికారి పోటీ చేయనున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల హీట్ అప్పుడే మొదలైంది. మార్చి 15 న బెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ మరుసటి రోజే బీజేపీ తన తొలి జాబితాను వెల్లడించింది. ఈ మేరకు 144 మందితో కూడిన జాబితాను తాజాగా విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఈ అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తదితర అగ్రనేతలు పాల్గొన్నారు. గెలుపే లక్ష్యంగా క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
भारतीय जनता पार्टी की केन्द्रीय चुनाव समिति ने होने वाले पश्चिम बंगाल विधानसभा चुनाव 2026 के लिए निम्नलिखित नामों पर अपनी स्वीकृति प्रदान की है। (1/3) pic.twitter.com/VlT3Z8Q9DJ
— BJP (@BJP4India) March 16, 2026
ఇక బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రాతినిథ్యం వహిస్తున్న భవానీపూర్ నియోజకవర్గం నుంచి రాష్ట్ర ప్రతిపక్షనేత సువేంధు అధికారి పోటీ చేయనున్నారు. మరోవైపు నందిగ్రామ్ నుంచి కూడా ఆయనే బరిలో నిలవనున్నారు. అయితే 2011 నుంచి భవానీపూర్ నియోజకవర్గం తృణమూల్ కాంగ్రెస్ కంచుకోటగా ఉంది. సువేందు అధికారి పోటీ చేయనున్న నేపథ్యంలో మరి ఈ సారి కూడా టీఎంసీ ఈ స్థానాన్ని నిలబెట్టుకుంటుందా..? లేదా..? అన్నది తేలాల్సి ఉంది.
ఇక పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. బెంగాల్ లోని ప్రస్తుత శాసనసభ పదవీకాలం మే 7 వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ తేదీలోపే అక్కడ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇక ఈ సారి కూడా టీఎంసీ, బీజేపీ పార్టీల మధ్యే హోరాహోరీ జరిగే అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ఏ మేరకు సీట్లు సాధిస్తాయో చూడాలి. బెంగాల్ లో పోలింగ్ ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో ఉంటుంది. ఇక కౌంటింగ్ మే 4 న జరగనుంది.


