Andhra Pradesh
oi-Chandrasekhar Rao
కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమైంది. వీటి తేదీలను తిరుమల తిరుపతి దేవస్థానం ఖరారు చేసింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ఆరంభం అయ్యాయి. టీటీడీ ఉన్నతాధికారులు పలుదఫాలుగా సమీక్షలు నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు చేపట్టారు. లక్షలాదిమంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున.. రద్దీకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయక్కడ.
ఈ నెల 26 నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఒంటిమిట్ట ఆలయంలో వైభవంగా జరుగనున్నాయి. ఇందులో భాగంగా ఆలయంలో ఈ నెల 24న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 26న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రతి రోజు ఉదయం 7:30 నుండి 9:30 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయి.
ఏర్పాట్లపై ఒంటిమిట్ట టీటీడీ అతిథి గృహంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ ఈ సందర్భంగా మాట్లాడారు. శ్రీరామనవమి, శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున భద్రత, పార్కింగ్, అన్నప్రసాదాల పంపిణీ, తాత్కాలిక మరుగుదొడ్లు, నిరంతరాయ విద్యుత్ సరఫరా, ప్రథమ చికిత్స కేంద్రాలు, ఆర్టీసీ బస్సులు, హెల్ప్ డెస్కులు, సూచిక బోర్డులు, పారిశుద్ధ్యం, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ వంటి అన్ని విభాగాలు సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో పనిచేయాలని సూచించారు.
తెలుగు సంప్రదాయం ప్రతిబింబించేలా ప్రత్యేక అలంకరణలు చేపట్టాలని టీటీడీ అదనపు కార్యదర్శి సీహెచ్ వెంకయ్య చౌదరి సూచించారు. ఏప్రిల్ 1న జరిగే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. వేసవి దృష్ట్యా కళ్యాణ వేదిక వద్ద నీటితో పిచికారీ చేయాలని, వడదెబ్బ తగలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుని పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు.
గ్యాలరీల్లో నిర్వహణ పటిష్టంగా ఉండాలని, ప్రతి చోటా అన్నప్రసాదాలు, మంచినీరు విరివిగా అందేలా చూడాలని వెంకయ్య చౌదరి సూచించారు. బ్రహ్మోత్సవాల కోసం పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నామని టీటీడీ సీవీఎస్ఓ కేవీ మురళీకృష్ణ తెలిపారు. కమాండ్ కంట్రోల్ ద్వారా భక్తులకు సమస్యలు తలెత్తితే వెంటనే స్పందించేందుకు ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని సూచించారు.


