Telangana
oi-Dr Veena Srinivas
తెలంగాణ అన్నదాతలకు రేవంత్ సర్కార్ శుభవార్త అందించింది. ఎప్పుడెప్పుడా అని రైతులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలపై తీపి కబురు చెప్పిన విషయం తెలిసిందే. సుదీర్ఘ చర్చల అనంతరం రైతు భరోసా నిధులను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 22వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి నిధులు జమ కానున్నాయి.
రైతు భరోసాపై మరో తీపి కబురు
మొత్తం 1.50 కోట్ల ఎకరాలకు సంబంధించి రూ. 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయటానికి తెలంగాణా ప్రభుత్వం రెడీ అయ్యింది. ఇది మాత్రమే కాదు రైతులకు రైతు భరోసాపై మరో తీపి కబురు చెప్పింది తెలంగాణా సర్కార్. ఇప్పటివరకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందని రైతులకు కొత్త అప్లికేషన్ పెట్టుకోవటానికి అవకాశం కల్పిస్తున్నట్టు వెల్లడించింది.
రైతు భరోసా అప్లికేషన్ ఫారంలో పూర్తి వివరాలు
కొత్తగా పట్టా పొందిన వారికి ప్రభుత్వం తీపికబురు చెప్పింది, 2026 ఫిబ్రవరి 28లోపు పట్టా పొందిన రైతులు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అని పేర్కొంది. అర్హులైన రైతులు తమ ఆధార్ కార్డు, పట్టా పాస్బుక్, బ్యాంక్ ఖాతా జిరాక్స్ కాపీలతో పాటు రైతు భరోసా అప్లికేషన్ ఫారంలో పూర్తి వివరాలు నింపి దరఖాస్తు చేసుకోవచ్చు.
రైతు భరోసా పొందటం కోసం రైతు వేదికలు
రైతులు రైతు భరోసా పొందటం కోసం రైతు వేదికలు లేదా వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఇదిలాఉంటే రైతు భరోసా మొదటి విడతగా ఈ నెల 22న సిద్దిపేట జిల్లా నర్మెట్ట నుంచి 70లక్షల మంది రైతులకు ఎకరం వరకు రూ. 3,590కోట్లు సీఎం రేవంత్ రెడ్డి బదిలీ చేయనున్నారు. ఆ తర్వాత 20రోజులకు రెండో విడతలో రూ. 2,650కోట్లు జమ చేయనున్నారు.
రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ. 12,000
ఏప్రిల్ నెలాఖరులోగా మిగిలిన రైతులకు మూడో విడత సాయం కూడా ఇవ్వాలని నిర్ణయించారు. రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ. 12,000 చొప్పున పెట్టుబడి సాయం లభిస్తుంది. ఈ మొత్తం రెండు దఫాలుగా ప్రభుత్వం ఇస్తుంది. ఒక్కోసారి రూ. 6,000 చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది.
రైతులకు పంట పెట్టుబడి సాయం
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తూ, ఇది పంట సాగుకు ఆర్థిక తోడ్పాటు అవుతుందని చెప్తున్నారు. ప్రతీ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్ ల కోసం రైతులకు ఈ పంట పెట్టుబడి సాయం అందిస్తుంది ప్రభుత్వం.


