Oil Crisis: గ్యాస్ ఆగితే..కష్టాలు మొదలు:మనిషి కడుపులోనైనా..ప్రపంచ మార్కెట్లోనైనా..!!

Date:


India

oi-Kannaiah

మనం ఎప్పుడైనా నూనె వస్తువులు ఎక్కువగా తిన్నప్పుడు ఏమవుతుంది? కడుపు ఆ ఆహారాన్ని అరిగించుకోవడానికి ఇబ్బంది పడుతుంది. లోపల గ్యాస్ తయారవుతుంది.. ఒక్కసారిగా శరీరం అంతా అసౌకర్యంగా మారుతుంది. శరీరం భారంగా అనిపిస్తుంది, ఏదో తెలియని ఆందోళన మొదలవుతుంది. అప్పుడు మనకు కావాల్సింది ఒక్కటే..ఆ ఒత్తిడి నుండి తక్షణ ఉపశమనం. ఇప్పుడు మన శరీరం నుండి దృష్టిని మళ్ళించి ప్రపంచ యవనికపైకి తీసుకెళ్లండి.దశాబ్దాలుగా ప్రపంచానికి కావాల్సిన చమురు హోర్ముజ్ జలసంధి వంటి కీలక మార్గాల ద్వారా ప్రవహిస్తోంది.అది ప్రపంచానికి ఇంధనాన్ని అందించే ప్రధాన నాడి.ఎప్పుడైతే యుద్ధాల వల్లనో,వివాదాల వల్లనో ఈ ప్రవాహానికి అడ్డంకి ఏర్పడుతుందో..అప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా మన కడుపులో గ్యాస్ సమస్య వచ్చినట్టే స్పందిస్తుంది.

ఒత్తిడి పెరుగుతోంది..

సరఫరా గొలుసు మందగిస్తుంది.పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయి.గ్యాస్ సిలిండర్ల ధరలు ఆకాశాన్ని తాకుతాయి.ఆ ఆర్థిక అసౌకర్యం కేవలం దేశాలకే కాదు,సామాన్యుల వంటగది వరకు చేరుతుంది.ఈ ఒత్తిడి కడుపులో కాదు..మార్కెట్లు,ప్రభుత్వాలు ఇలా ప్రతి ఇంట్లో కనిపిస్తుంది.

ఈ పోలికలు అక్కడితో ఆగవు..

కడుపులో గ్యాస్‌తో ఇబ్బంది పడే వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉంటాడు. నెమ్మదిగా నడుస్తాడు, జాగ్రత్తగా కూర్చుంటాడు.. ఉపశమనం కోసం వేడి నీళ్లనో లేదా సోడానో వెతుక్కుంటాడు.ఇంధన సంక్షోభం వచ్చినప్పుడు దేశాలు కూడా సరిగ్గా అలాగే ప్రవర్తిస్తాయి.వ్యవస్థలు నిలిచిపోతాయి,బుకింగ్‌లు తగ్గిపోతాయి.అధికారులు తక్షణ పరిష్కారాల కోసం వెతుకులాట మొదలుపెడతారు.కొత్త విధానాలు,అత్యవసర దిగుమతులు లేదా దౌత్యపరమైన ప్రయత్నాలు..ఇవన్నీ ఆ ఒత్తిడిని తగ్గించడానికి వారు వాడే ‘సోడా’ లాంటి పరిష్కారాలే.

చికిత్స ఏమిటి?

శరీరానికి అయితే పరిష్కారం సులభం.కొంచెం వేడి నీళ్లు..నెమ్మదిగా నడక..కాస్త ఓపిక. మరి దేశాల విషయానికి వస్తే ఇది కొంచెం క్లిష్టమైనది,కానీ సూత్రం మాత్రం ఒక్కటే.వేడి వేడి దౌత్య చర్చలు వ్యూహాత్మక కదలికలు..సమతుల్యతను కాపాడటానికి చేసే ప్రయత్నాలు.అసలు ఈ అసౌకర్యం ఎంతకాలం ఉంటుంది?అన్న ప్రశ్న వస్తే..ఒక డాక్టర్ ఏమంటారంటే”గ్యాస్ బయటకు పోయే వరకు.”
ఒక ఆర్థికవేత్త కూడా అదే అంటారు.. “ముడిచమురు మోసుకొచ్చే నౌకలు ఆ మార్గం నుండి ప్రయాణించే వరకు.”అని.అంటే.. ప్రవాహం మళ్ళీ మొదలైనప్పుడే ఉపశమనం లభిస్తుంది.

చివరిగా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒక్కటే.ఒక రోగి ఏమనుకుంటాడు? “అబ్బా..వచ్చేసారి ఇంత ఎక్కువగా తినకూడదు.”డాక్టర్ ఏమంటారు?”అవును,అప్పుడే నీ శరీరం బాగుంటుంది.”అదే సమయంలో ప్రపంచ దేశాల డిస్కషన్స్ గదుల్లో కూడా ఒక ఆలోచన రావాలి.”మరోసారి ప్రపంచం ఇంతగా గొడవపడకూడదు..యుద్ధాలు అనేవి రాకూడదు.”ఎందుకంటే అది మనిషి శరీరమైనా,ప్రపంచ ఆర్థిక వ్యవస్థయినా..’సమతుల్యత’చాలా ముఖ్యం.ఆ బ్యాలెన్స్ దెబ్బతిన్నప్పుడు కలిగే అసౌకర్యం మనకు ఒకటే గుర్తు చేస్తుంది..ఈ ప్రపంచంలో ప్రతిదీ ఒకదానితో ఒకటి ఎంతగా ముడిపడి ఉందో అని.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related