International
oi-Syed Ahmed
ఇరాన్ (iran)వార్ సైనిక లక్ష్యాల నుంచి చమురు క్షేత్రానికి మళ్లుతోంది. రాజకీయ లక్ష్యాల్ని నిర్మూలించడంతో మొదలుపెట్టిన ఈ వార్ ను అమెరికా-ఇజ్రాయెల్ ఇప్పుడు ఆర్దిక లక్ష్యాలవైపుకు మళ్లిస్తున్నాయి. దీనికి కారణం ఇరాన్ ఆర్దికంగా బలంగా ఉన్నంత కాలం ఈ యుద్దాన్ని తాము ముగించలేమని ఈ రెండు దేశాలు ఓ నిర్ణయానికి వచ్చేయడమే. దీంతో తాజాగా ఇజ్రాయెల్ .. ఇరాన్ లోని కీలకమైన సౌత్ పార్స్ చమురు క్షేత్రంపై దాడులకు దిగింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ .. ఖతార్ లోని రాస్ లఫాన్ ఆయిల్ హబ్ పై దాడులు చేసింది.
ఇరాన్లోని సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ పొరుగుదేశాల్లో చమురు క్షేత్రాలపై దాడులు తప్పవని తీవ్ర హెచ్చరికలు చేసింది. అన్నట్లుగానే ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని ఇంధన మౌలిక సదుపాయాలపై ఐదు క్షిపణులతో దాడులకు దిగింది. ఇందులో ఒక క్షిపణి రాస్ లఫాన్ ఆయిల్ హబ్ పై పడింది. ఫలితంగా ఖతార్లోని కీలక చమురు కేంద్రాలలో అగ్నిప్రమాదాలు, సౌదీ అరేబియాలో అంతరాయాలు ఏర్పడ్డాయి. మరో నాలుగు క్షిపణుల్ని ఖతార్ విజయవంతంగా అడ్డుకుంది.
ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జీ ఉత్పత్తి కేంద్రం ఉన్న ఖతార్ లోని రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీలో ఇరాన్ జరిపిన దాడుల్లో అగ్నిప్రమాదం సంభవించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నివేదించింది. ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఎల్ఎన్జీ ఎగుమతిదారు అయిన ఖతార్ ఎనర్జీ ఇరాన్ దాడి తర్వాత తమ ప్రధాన గ్యాస్ కేంద్రానికి భారీ నష్టం వాటిల్లినట్లు ధృవీకరించింది.
మంటలను అదుపులోకి తీసుకురావడానికి అత్యవసర సహాయక బృందాలను వెంటనే రంగంలోకి దించినట్లు తెలిపింది. అయితే ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొంది. దోహాకు ఉత్తరాన 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాస్ లఫాన్, ఇంధన పరిశ్రమకు కేంద్రంగా ఉంది. అలాగే అనేక అంతర్జాతీయ కంపెనీలకు ఆతిథ్యం ఇస్తుంది.
ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులకు పాల్పడవద్దని గల్ఫ్ దేశాలు హెచ్చరిస్తున్నా..ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా అదుపులేని పరిణామాలు సంభవిస్తాయని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ కౌంటర్ హెచ్చరికలు చేశారు. ఇరాన్లోని ఇంధన మౌలిక సదుపాయాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకోవడం ప్రపంచ ఇంధన భద్రతకు ప్రత్యక్ష ముప్పు అని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పేర్కొంది. ఈ ఘటనలతో ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. కీలకమైన ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులతో ప్రపంచ ఇంధన మార్కెట్లకు, ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పులు తీవ్రమవుతున్నాయి. దీంతో అంతర్జాతీయంగా చమురు ధరలు కూడా పెరుగుతున్నాయి. యూరప్ మార్కెట్లలో క్రూడ్ ధర 107 డాలర్ల వరకూ వెళ్లింది. ఇదే పరిస్ధితి కొనసాగితే ఇది 150 డాలర్లకు కూడా వెళ్లే ప్రమాదం పొంచి ఉంది.


