మస్క్‌కు భారీ షాక్: అలా చేశాడని వేల కోట్ల జరిమానా!

Date:


Business

oi-Lingareddy Gajjala

ఒక్క ట్వీట్.. వేల కోట్ల సామ్రాజ్యాన్ని శాసించగలదు, అదే సమయంలో బిలియన్ల డాలర్ల జరిమానాను కూడా మోపగలదు! ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ విషయంలో ఇప్పుడు ఇదే జరిగింది. 2022లో ట్విట్టర్ (ప్రస్తుత X) కొనుగోలు సమయంలో ఆయన వేసిన ‘మైండ్ గేమ్’ ఇప్పుడు ఆయనకే చుట్టుకుంది.

ప్రపంచ కుబేరుడు, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్‌కు అమెరికా జ్యూరీ గట్టి షాక్ ఇచ్చింది. 2022లో ట్విట్టర్ కొనుగోలు సమయంలో పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించారనే ఆరోపణలపై కాలిఫోర్నియా ఫెడరల్ జ్యూరీ మస్క్‌ను బాధ్యుడిని చేస్తూ తీర్పునిచ్చింది. ఈ పరిణామంతో ఆయన దాదాపు 2.6 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 21,000 కోట్లకు పైగా) భారీ పరిహారం చెల్లించాల్సి రావచ్చని తెలుస్తోంది. మస్క్ చేసిన కొన్ని వివాదాస్పద ట్వీట్లు సెక్యూరిటీల నిబంధనలను ఉల్లంఘించాయని జ్యూరీ నిర్ధారించింది.

మస్క్ 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ను కొనుగోలు చేసే ప్రక్రియలో ఉండగా, ఆయన చేసిన బహిరంగ వ్యాఖ్యలు షేర్ ధరను ప్రభావితం చేశాయని గియుసెప్పే పంపేనా అనే పెట్టుబడిదారుడు సమిష్టి దావా (Class Action Suit) వేశారు. ముఖ్యంగా ట్విట్టర్‌లో నకిలీ ఖాతాలు (Spam Bots) ఎక్కువగా ఉన్నాయని, అందుకే కొనుగోలును “తాత్కాలికంగా నిలిపివేస్తున్నాను” అంటూ మస్క్ చేసిన ప్రకటనలు మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టించాయి. ఈ వ్యాఖ్యల వల్ల షేర్ ధర తగ్గడంతో, భయపడిన పెట్టుబడిదారులు తక్కువ ధరకే తమ వాటాలను విక్రయించి నష్టపోయారని జ్యూరీ అభిప్రాయపడింది.

కోర్టులో మస్క్ వాదనలు ఇవే..

విచారణలో భాగంగా మస్క్ తన వాదనలను వినిపించారు. ట్విట్టర్‌లోని స్పామ్ ఖాతాలపై తనకున్న ఆందోళనలు నిజమైనవని, షేర్ ధరను తగ్గించాలనే దురుద్దేశం తనకు లేదని ఆయన సాక్ష్యం ఇచ్చారు. తన సోషల్ మీడియా పోస్ట్‌లు మార్కెట్‌పై ఇంతటి భారీ ప్రభావాన్ని చూపుతాయని తాను ఊహించలేదని కోర్టుకు తెలిపారు. అయితే, మస్క్ చేసిన రెండు నిర్దిష్టమైన ట్వీట్లు పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని జ్యూరీ స్పష్టం చేసింది.

మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశం..

మొదట్లో ఈ ఒప్పందం నుండి తప్పుకోవాలని మస్క్ ప్రయత్నించినప్పటికీ, ట్విట్టర్ చట్టపరమైన పోరాటానికి దిగడంతో చివరకు 2022 అక్టోబర్‌లో కొనుగోలు ప్రక్రియను పూర్తి చేశారు. అప్పటి నుండి ట్విట్టర్‌ను ‘X’ గా మార్చి, తన ఇతర సంస్థలైన స్పేస్‌ఎక్స్, xAI లతో అనుసంధానించారు. నష్టపరిహారం మొత్తం ఇంకా అధికారికంగా ఖరారు కానప్పటికీ, ప్రతి షేర్‌కు కలిగిన నష్టాన్ని బట్టి ఇది బిలియన్ల డాలర్లలో ఉండవచ్చని జ్యూరీ సూచించింది. మార్కెట్‌ను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న వ్యక్తులు చేసే ప్రకటనలకు ఎంతటి జవాబుదారీతనం ఉంటుందో ఈ కేసు మరోసారి నిరూపించింది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related