International
oi-Jakki Mahesh
Iran Israel War: మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ దేశంలోని అత్యంత సురక్షితమైన, సున్నితమైన ప్రాంతంగా పరిగణించబడే నతాంజ్ అణు కేంద్రంపై అమెరికా-ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా భారీ బాంబు దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడితో ఆ ప్రాంతమంతా భారీ పేలుళ్లతో దద్దరిల్లింది.
నతాంజ్ లక్ష్యంగా దాడులు
ఈ దాడి ప్రధానంగా నతాంజ్ అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగింది. ఈ పేలుళ్ల శబ్ధం చాలా కిలోమీటర్ల వరకు వినిపించిందని.. దీని వల్ల ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగిందని అధికారులు వెల్లడించారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సాగిస్తున్న నిరంతర పోరులో భాగంగానే ఈ తాజా సైనిక చర్య జరిగినట్లు తెలుస్తోంది.
ప్రమాదం తప్పినట్లేనా?
ఈ భారీ దాడి జరిగినప్పటికీ.. పర్యావరణపరంగా ఓ పెద్ద ముప్పు తప్పిందని ఇరాన్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రాథమిక విచారణలో అణు కేంద్రం నుంచి ఎలాంటి రేడియేషన్ విడుదల కాలేదని ధ్రువీకరించారు. అణు వ్యర్థాలు బయటకు రాకపోవడంతో సమీప నివాస ప్రాంతాల్లో నివసించే ప్రజలందరూ సురక్షితంగా ఉన్నారని ప్రభుత్వం ప్రకటించింది.
లక్ష్యంగా మారిన నతాంజ్
నతాంజ్ అణు కేంద్రం గత కొంతకాలంగా శత్రువుల ప్రధాన లక్ష్యంగా ఉంది. 2025 నుంచి ఇప్పటివరకు ఈ నతాంజ్ అణు కేంద్రంపై అనేకసార్లు దాడులు జరిగాయి. గతేడాది జూన్లో ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య జరిగిన 12 రోజుల భీకర యుద్ధంలో కూడా నతాంజ్ ప్రధాన లక్ష్యంగా ఉంది. ప్రతిసారి ఇక్కడి యంత్రాలు, భవన నిర్మాణాలకు నష్టం జరుగుతున్నప్పటికీ.. పర్యావరణానికి మాత్రం పెద్దగా హాని కలగకపోవడం గమనార్హం. ఈ దాడితో మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.


