Andhra Pradesh
oi-Lingareddy Gajjala
ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు మరియు సొసైటీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. వీరి పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ మంత్రివర్గ ఉపసంఘం శనివారం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. మంత్రులు నారా లోకేశ్, పయ్యావుల కేశవ్, పి.నారాయణలతో కూడిన ఈ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయంతో సుమారు 10 వేల మంది ఉద్యోగులకు నేరుగా లబ్ధి చేకూరనుంది. గత ప్రభుత్వం కాలయాపన చేసిన ఈ అంశాన్ని కూటమి సర్కార్ ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించడం విశేషం.
జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీలతో పాటు సొంత నిధులతో నడుస్తున్న 50కి పైగా కార్పొరేషన్ల ఉద్యోగులకు ఈ పెంపు వర్తిస్తుంది. గతంలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెరిగినప్పటికీ, కార్పొరేషన్ల ఉద్యోగులను అప్పటి వైసీపీ ప్రభుత్వం విస్మరించింది. దీనిపై సుమారు 1,565 మంది ఉద్యోగులు కోర్టు మెట్లు ఎక్కగా.. ఇది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది.
రెట్రోస్పెక్టివ్ అమలు.. మళ్ళీ విధుల్లోకి!
ఈ నిర్ణయంలో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే.. ఈ పెంపును 2022 జనవరి 1వ తేదీ నుంచే వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- రిటైరైన వారు: ఇప్పటికే పదవీ విరమణ చేసి, ఇంకా 62 ఏళ్లు నిండని వారిని తిరిగి విధుల్లోకి తీసుకుంటారు. పదవీ విరమణకు కేవలం 3 నెలల సమయం ఉన్నా సరే వారిని సర్వీసులోకి ఆహ్వానించనున్నారు.
- 62 దాటిన వారు: ఇప్పటికే 62 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి నోషనల్ ప్రయోజనాలు కల్పిస్తారు, దీనివల్ల వారి పెన్షన్ మొత్తం పెరుగుతుంది.
- అధ్యాపకులు: అగ్రికల్చర్ వర్సిటీల్లో పనిచేసే బోధనా సిబ్బంది పదవీ విరమణ వయస్సును 62 నుంచి 65 ఏళ్లకు పెంచే ప్రతిపాదనలకు కూడా ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది.
Retirement పై అప్పుడూ.. ఇప్పుడూ చంద్రబాబే!
రాష్ట్ర విభజన తర్వాత 2014లో రిటైర్మెంట్ వయస్సును 58 నుంచి 60 ఏళ్లకు పెంచింది చంద్రబాబు ప్రభుత్వమే. ఆ తర్వాత 2016లో కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగులకు కూడా అదే వెసులుబాటు కల్పించారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఖజానాపై భారం పడకుండా ఉండటానికి కేవలం ప్రభుత్వ ఉద్యోగుల వయస్సు పెంచి, సొంత నిధులతో నడిచే కార్పొరేషన్ల ఉద్యోగులను విస్మరించారనే విమర్శలు ఉన్నాయి.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో అటు ఉద్యోగులకు న్యాయం జరగడమే కాకుండా, కార్పొరేషన్లపై అదనపు భారం కూడా పడదు. ప్రభుత్వ నిర్ణయంపై ఏపీఎన్జీవో సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.


