Andhra Pradesh
oi-Chandrasekhar Rao
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీలో మార్పు లేదు. తాకిడి కొనసాగుతోంది. వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. తలనీలాలను సమర్పించుకుంటోన్నారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోతున్నాయి. రద్దీగా మారుతున్నాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి గంటల కొద్దీ సమయం పడుతోంది.
కాగా- తిరుమలలో వార్షిక సాలకట్ల వసంతోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30 నుండి ఏప్రిల్ 1 వరకు మూడు రోజుల పాటు జరుగుతాయి. వసంత రుతువు రాకను సూచించే ఈ పండుగను చైత్ర మాసంలో (మార్చి-ఏప్రిల్) సంప్రదాయబద్ధంగా త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి దినాలలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 1,460ల దశకంలో అచ్యుత రాయలు పాలనలో ఉత్సవం మొదలైనట్లు ఆలయ ఐతిహ్యం చెబుతోంది.
వేసవి తాపం నుండి శ్రీవారికి ఊపశమనం కల్పించడంలో భాగంగా ఈ పండుగలో ఉత్సవమూర్తులకు సుగంధ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఉత్తరాభాద్ర నక్షత్రం రోజున అంకురార్పణంతో ఈ మూడు రోజుల ఉత్సవాలు ఆరంభమౌతాయి. నవధాన్యాలను మొలకెత్తించే క్రతువును చేపడుతారు. ఆ తర్వాత పుణ్యాహవచనం, వాస్తు శాంతి, సంప్రోక్షణ వంటి పూజలను ఆలయ అర్చకులు నిర్వహిస్తారు.
- మూడు రోజులూ శ్రీ మలయప్ప స్వామివారు తన దేవేరులతో కలిసి అలంకరించిన వసంత మండపానికి ఊరేగింపుగా వస్తారు. మొదటి రెండు రోజులు ఉత్సవ మూర్తులకు సుగంధ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.
- రెండవ రోజు ఉదయం శ్రీదేవి, భూదేవితో కలిసి మలయప్ప స్వామివారు స్వర్ణ రథంపై నాలుగు మాడ వీధులలో ఊరేగుతారు. అశేష భక్తు జనావళిని కటాక్షిస్తారు. ఇది ఉత్సవంలో ప్రధాన ఘట్టం. ఆ రోజున భక్తుల తాకిడి అధికంగా ఉండొచ్చని టీటీడీ అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది.
- మూడవ రోజున శ్రీ మలయప్ప స్వామి, శ్రీదేవి, భూదేవిలతో పాటు సీతారామ లక్ష్మణాంజనేయ స్వామి, రుక్మిణీ సత్యభామా సమేత కృష్ణ స్వామి కూడా ఊరేగింపులో పాల్గొంటారు. ఊరేగింపు అనంతరం, అన్ని ఉత్సవమూర్తులకు వసంత మండపంలో భక్తిశ్రద్ధలతో స్నపన తిరుమంజనం జరుగుతుంది.
- ఉత్సవాల దృష్ట్యా, టీటీడీ మూడు రోజుల పాటు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసింది. మార్చి 31న జరిగే అష్టదళ పాదపద్మారాధన సేవను కూడా నిలిపివేసింది.


