Andhra Pradesh
oi-Syed Ahmed
ఏపీలో ఎల్పీజీ కొరత (LPG Crisis)తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రభుత్వాలు పైకి ఎల్పీజీ కొరత లేదని చెబుతున్నా క్షేత్రస్దాయిలో హోటల్స్ కు (AP Hotels) గ్యాస్ కొరత చుక్కలు చూపిస్తోంది. దీంతో వారు ఆ భారాన్ని ఎవరిపై నెట్టాలా అని ఆలోచిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే పలు చోట్ల టిఫిన్, భోజనం, ఇతర ఆహార పదార్ధాల రేట్లను పెంచేస్తున్నారు. ఇక్కడితో ఆగకుండా స్విగ్గీ, జొమాటో ఆర్డర్లను బంద్ చేయాలని నిర్ణయించారు. అలాగే వారంలో ఒకరోజు సెలవు తీసుకోవడం, రాత్రి 10 గంటల వరకే పనిచేయాలని నిర్ణయించాయి.
కమర్షియల్ ఎల్పీజీ అందుబాటులో లేకుండా పోతుందన్న భయాల నేపథ్యంలో ఎవరికి వారు ప్రస్తుతం తమ వద్ద ఉన్న సిలెండర్లను బ్లాక్ చేయడం మొదలుపెట్టేశారు. దీంతో ఒకటి రెండు సిలెండర్లు వాడుకునే హోటల్స్ కు సైతం ఇప్పుడు కష్టాలు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో చేసేది లేక చిన్నా చితకా హోటల్స్ సైతం ఆహార పదార్ధాల రేట్లు పెంచేస్తున్నాయి. దీనికి తోడు గ్యాస్ సంక్షోభం నుంచి బయటపడేందుకు వారంలో ఒక రోజు సోమవారం హోటల్స్ ను బంద్ చేయాలని నిర్ణయించాయి.
దాదాపు ప్రతీ హోటల్ తమ బయటి ఆర్డర్లను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా రేపటి నుంచి స్విగ్గీ, జొమాటో ఆర్డర్లు స్వీకరించరాదని నిర్ణయించాయి. అలాగే రాత్రి 10 గంటల వరకే హోటల్స్ పని వేళలు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరబోతున్నాయి. ప్రభుత్వం దీనిపై ప్రకటన చేసేందుకు అంగీకరించకపోతే తామే హోటల్స్ ను స్వచ్చందంగా రాత్రి 10 గంటలకే మూసేసేలా నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇంకా సంక్షోభం ముదిరితే హోటల్స్ కేవలం టీ, కాఫీలు అమ్ముకునేందుకే పరిమితం కావాలని కూడా భావిస్తున్నాయి.


