Capgemini:విశాఖకు టెక్ దిగ్గజ సంస్థ క్యాప్ జెమినీ.. సీఈఓతో మంత్రి లోకేష్ భేటీ..!!

Date:


Andhra Pradesh

oi-Kannaiah

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నం ఐటీ ముఖచిత్రాన్ని మార్చే దిశగా చంద్రబాబు ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.రాష్ట్ర ఐటీ,ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్..ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజం ‘క్యాప్ జెమినీ’ (Capgemini) సీఈవో ఐమాన్ ఇజ్జత్ తో భేటీ అయ్యారు. విశాఖను గ్లోబల్ ఐటీ హబ్‌గా మార్చే వ్యూహంలో భాగంగా ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.విశాఖలో భారీ డెవలప్‌మెంట్ సెంటర్ మరియు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC) ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

విశాఖ: డేటా సెంటర్ల స్వర్గధామం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికతతో విశాఖపట్నం ఇప్పటికే డేటా సెంటర్ హబ్‌గా మారుతోందని లోకేష్ ఈ సందర్భంగా వివరించారు.దేశంలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ పనులు త్వరలోనే విశాఖలో ప్రారంభం కానున్నాయని పేర్కొన్న మంత్రి లోకేష్…ఇప్పటికే టీసీఎస్ (TCS), కాగ్నిజెంట్ (Cognizant)వంటి సంస్థలు విశాఖలో తమ కార్యకలాపాలను ప్రారంభించాయని గుర్తుచేశారు.మరో మూడు నెలల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రానుండటం ఐటీ ఎకో సిస్టమ్‌కు మరింత బలాన్నిస్తుందని మంత్రి వెల్లడించారు.

క్యాప్ జెమినీ ముందు మంత్రి లోకేష్ కీలక ప్రతిపాదనలు

విశాఖలో కనీసం 20 వేల మందికి ఉపాధి కల్పించే సామర్థ్యం గల ఐటీ డెవలప్‌మెంట్ సెంటర్,క్లౌడ్ సర్వీసెస్,బీపీఎం వర్టికల్స్‌ను ఏర్పాటు చేయాలని లోకేష్ కోరారు.వీటితో పాటు మరికొన్ని కీలక అంశాలపై చర్చించారు.ఆంధ్రప్రదేశ్‌లో ‘క్వాంటం వ్యాలీ’ అభివృద్ధికి సహకరించాలని, ప్రత్యేకంగా క్వాంటం వర్టికల్ స్థాపించాలని కోరారు.ఏఐ (AI),సైబర్ సెక్యూరిటీ,డిజిటల్ టాలెంట్ పైప్‌లైన్ అభివృద్ధికి ఏపీలోని విశ్వవిద్యాలయాలతో కలిసి కో-డెవలప్‌మెంట్ పార్టనర్‌గా వ్యవహరించాలని మంత్రి లోకేష్ క్యాప్ జెమిని సీఈఓకు విజ్ఞప్తి చేశారు. ప్రపంచ స్థాయి సేవల్లో భాగంగా ఫైనాన్షియల్ సర్వీసెస్,సస్టైనబిలిటీ రంగాల్లో ఎంటర్‌ప్రైజ్ కస్టమర్ల కోసం విశాఖ వేదికగా సాంకేతిక భాగస్వామిగా పనిచేయాలని కోరారు.

సానుకూలంగా స్పందించిన క్యాప్ జెమినీ సీఈవో

మంత్రి లోకేష్ ప్రతిపాదనలపై ఐమాన్ ఇజ్జత్ సానుకూలంగా స్పందించారు. 1967లో పారిస్ కేంద్రంగా ప్రారంభమైన తమ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 3.4 లక్షల మంది ఉద్యోగుల్లో, దాదాపు 2 లక్షల మంది భారత్‌లోనే ఉన్నారని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్, చెన్నై సహా 13 భారతీయ నగరాల్లో క్యాప్ జెమినీ కార్యకలాపాలు సాగిస్తోందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను తాము నిశితంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

క్యాప్ జెమినీ బలం ఎంత?

క్యాప్ జెమినీ కేవలం ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ మాత్రమే కాదు,ఇది ప్రపంచవ్యాప్తంగా $23.9 బిలియన్ల (దాదాపు రూ.2 లక్షల కోట్లు)వార్షిక ఆదాయం కలిగిన దిగ్గజ సంస్థ.ఇది విశాఖకు వస్తే,విశాఖ కేవలం సర్వీస్ సెంటర్ గానే కాకుండా, హై-ఎండ్ ఇంజనీరింగ్ మరియు కన్సల్టింగ్ హబ్‌గా కూడా ఎదుగుతుంది. ముఖ్యంగా మంత్రి కోరినట్లుగా “క్వాంటం కంప్యూటింగ్” విభాగం వస్తే,విశాఖపట్నం భవిష్యత్ టెక్నాలజీ ప్రపంచానికి చిరునామాగా మారుతుంది.

“స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్”మంత్రంతో ముందుకు వెళ్తున్న లోకేష్,కేవలం పెట్టుబడులు కోరడమే కాకుండా,విద్యా సంస్థలతో అనుసంధానం ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ నైపుణ్యాలు కల్పించేలా క్యాప్ జెమినీని ఒప్పించే ప్రయత్నం చేశారు.ఈ చర్చలు సఫలమైతే,విశాఖపట్నం ఐటీ రంగంలో తన పూర్వ వైభవాన్ని సంతరించుకోవడమే కాకుండా,దక్షిణ భారతదేశంలోనే అత్యంత కీలకమైన ఐటీ కేంద్రంగా అవతరిస్తుంది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related