Andhra Pradesh
oi-Lingareddy Gajjala
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు సామాన్యుడి భోజనంపై ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయంగా సరఫరా గొలుసు దెబ్బతినడంతో తెలుగు రాష్ట్రాల్లో ఎల్పీజీ (LPG) కొరత మొదలైంది. ముఖ్యంగా వాణిజ్య (Commercial) సిలిండర్ల సరఫరా గణనీయంగా తగ్గడంతో విజయవాడలోని హోటల్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విజయవాడ హోటల్స్ అసోసియేషన్ ట్రెజరర్ తెలిపిన వివరాల ప్రకారం.. గత రెండు మూడు రోజులుగా గ్యాస్ లభ్యత చాలా కష్టంగా మారింది. డీలర్లు తమ వద్ద ఉన్న రిజర్వు స్టాక్ను అందరికీ సమానంగా పంచుతున్నప్పటికీ, అది ఏమాత్రం సరిపోవడం లేదు. నగరంలో గ్యాస్ దొరక్కపోవడంతో హోటల్ నిర్వాహకులు చుట్టుపక్కల గ్రామాల నుంచి సిలిండర్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గతంలో గ్యాస్ ఏజెన్సీలే స్వయంగా వచ్చి ఆర్డర్లు అడిగేవారని, కానీ ఇప్పుడు సరఫరా 50 శాతానికి కుదించారని హోటల్ యజమానులు వాపోతున్నారు. హోటల్ నడవాలంటే గ్యాస్ ప్రాణాధారం. ఒకవేళ ఇదే పరిస్థితి మరో వారం రోజులు కొనసాగితే, నిర్వహణ భారమై హోటళ్లను మూసివేయక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. కేవలం లాభాల కోసమే కాకుండా, నగరానికి వచ్చే సందర్శకులకు బడ్జెట్లో ఆహారం అందించడమే తమ లక్ష్యమని, అయితే గ్యాస్ కొరత వల్ల సిబ్బంది వేతనాలు చెల్లించడం కూడా భారంగా మారుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
10 Gas సిలిండర్లు అడిగితే 6 ఇస్తున్నారు..
స్టార్ హోటల్స్ ప్రెసిడెంట్ స్వామి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గృహ వినియోగ గ్యాస్కు ప్రాధాన్యత ఇవ్వడంతో కమర్షియల్ సిలిండర్లకు కొరత ఏర్పడిందని తెలిపారు. ఒక పెద్ద రెస్టారెంట్కు రోజుకు 10 సిలిండర్లు అవసరమైతే, ప్రస్తుతం 5 నుంచి 6 మాత్రమే అందుతున్నాయని పేర్కొన్నారు. ఇదే తరుణంలో కొందరు కృత్రిమ కొరతను సృష్టించి బ్లాక్ మార్కెట్ చేస్తున్నారని, గతంలో రూ. 2 వేలు ఉన్న సిలిండర్ ధర ప్రస్తుతం రూ. 3 వేలకు చేరిందని ఆరోపించారు. ఈ సమస్యపై ఇప్పటికే సివిల్ సప్లై డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని, వారు డిస్ట్రిబ్యూటర్లతో చర్చిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.
GAS కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా?
అయితే, ఏపీలో పరిస్థితి పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ కంటే కాస్త మెరుగ్గానే ఉందని స్వామి అభిప్రాయపడ్డారు. పెద్ద పెద్ద హోటళ్లలో సీఎన్జీ (CNG) కనెక్షన్లు ఉండటం వల్ల వాటికి ముప్పు లేదని, కానీ చిన్న మరియు మధ్య తరహా హోటళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. పరిస్థితి తీవ్రతను బట్టి హోటళ్లను రొటేషన్ పద్ధతిలో నడుపుకోవడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చని సూచించారు. వారం రోజుల్లో సరఫరా సాధారణ స్థితికి వస్తుందని ఆశిస్తున్నట్లు హోటల్ యజమానులు పేర్కొంటున్నారు.


