Telangana
oi-Bomma Shivakumar
తన పేరుతో ఎలాంటి సంస్థలు లేవని.. తన పేరుతో సంస్థలు స్థాపించి కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతులు లేవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.’కేటీఆర్ సేవా సమితి’, ‘కేటీఆర్ సేన’ లాంటి పేర్లతో సంస్థలను ఏర్పాటు చేసి కార్యకలాపాలు చేపడుతున్నట్లు సమాచారం అందిందన్నారు. అలాంటి ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించబోమని..ఆ సంస్థలకు ఎటువంటి అధికారిక గుర్తింపు లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఎవరైనా సామాజిక, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనాలనుకుంటే.. అవి తప్పనిసరిగా భారత రాష్ట్ర సమితి పరిధిలోనే చేయాలని పేర్కొన్నారు. తనపై అభిమానం ఉన్నవారు నేరుగా పార్టీతో కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. కొంతమంది ‘కేటీఆర్ సేవా సమితి’, ‘కేటీఆర్ సేన’ లాంటి పేర్లతో సంస్థలను ఏర్పాటు చేసి కార్యకలాపాలు చేపడుతున్నట్లు తెలిసిన నేపథ్యంలో ఆయన పైవిధంగా స్పందించారు.
మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ కీలక ఆరోపణలు చేశారు. తెలంగాణను ఏఐసీసీకి ఏటీఎంలా మార్చారని కేటీఆర్ ధ్వజమెత్తారు. రెండేళ్లుగా తాము అనేకసార్లు ఈ విషయంపై హెచ్చరించామని.. ఇప్పుడు రేవంత్రెడ్డే నిస్సిగ్గుగా ఒప్పుకున్నారని ఎక్స్ వేదికగా కేటీఆర్ పోస్టు పెట్టారు. రాష్ట్ర సంపదను కాంగ్రెస్ అధిష్ఠానానికి ధారపోస్తూ.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దిల్లీ వీధుల్లో తాకట్టు పెడుతున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన 420 హామీల అమలుతోపాటు అభివృద్ధి పనులకూ ప్రభుత్వం వద్ద రూపాయి నిధుల్లేవంటూ సాకులు చెప్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.


