Andhra Pradesh
oi-Syed Ahmed
ఇరాన్ వార్ కారణంగా ఎల్పీజీ కొరత (LPG Scarcity) ఏర్పడవచ్చన్న భయాలతో ముందస్తుగా ఎక్కడికక్కడ గ్యాస్ సిలెండర్లు బ్లాక్ చేస్తున్న వేళ.. రాష్ట్రంలో తాజా పరిస్ధితిపై సీఎం చంద్రబాబు ఇవాళ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా చమురు కంపెనీల ప్రతినిధులు, గెయిల్, ఓఎన్టీసీ అధికారులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గ్యాస్ సరఫరా పరిస్ధితిపై వారి నుంచి వివరాలు తీసుకున్న చంద్రబాబు (chandrababu).. అనంతరం వారికి కీలక ఆదేశాలు ఇచ్చారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 14 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలు ఉన్నాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు. మరికొన్ని మెట్రిక్ టన్నుల గ్యాస్ అందుబాటులోకి రాబోతోందన్నారు. రాష్ట్రంలో ఎల్పీజీ సరఫరాకు ఇబ్బందులు లేవన్నారు. ఆస్పత్రులకు, హాస్టళ్లు, దేవాలయాలకు ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు తక్షణం అందుబాటులోకి వచ్చే ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేయాలని చంద్రబాబు సూచించారు. మరో 15 రోజులకు అవసరమైన గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని ఈ సందర్భంగా తెలిపారు.
ఈకేవైసీ, ఓటీపీల ద్వారా గ్యాస్ సిలిండర్ల డైవర్షన్ లేకుండా, ప్రజలు ఆందోళనకు గురి కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో ఇండక్షన్ స్టవ్స్ స్టాక్స్ లభ్యత పెరిగేలా చూడాలన్నారు. అలాగే గ్యాస్ కంపెనీలు స్వల్పకాలికంగా ఉత్పత్తి పెంపు, మెరుగైన పంపిణీ జరిగేలా చూడాలన్నారు. రాష్ట్రంలో మరింతగా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ విస్తరించే అంశంపై దృష్టి సారించాలని సీఎం సూచించారు. ఏపీలోని కేజీ బేసిన్ లో ఉత్పత్తి అవుతున్న సహజ వాయువును పైప్డ్ నెట్వర్క్ ద్వారా ప్రజలకు సరఫరా చేసేలా చూడాలని, సీఎన్జీ, పీఎన్జీల వినియోగాన్ని గరిష్టంగా పెంచేందుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని కూడా చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.


