Raghav Chadha: పెళ్లైన జంటలపై ఐటీ భారమా? రాఘవ్ చద్దా సంచలన స్పీచ్

Date:


Business

oi-Lingareddy Gajjala

పార్లమెంటులో తన వాక్చాతుర్యంతో, తార్కిక విశ్లేషణతో యువతను విశేషంగా ఆకట్టుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) యువ ఎంపీ రాఘవ్ చద్దా మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. ఈసారి ఆయన నేరుగా మధ్యతరగతి కుటుంబాల జేబులకు ఉపశమనం కలిగించేలా ‘జాయింట్ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ (ITR)’ అంశాన్ని తెరపైకి తెచ్చారు. వివాహిత జంటలకు ఉమ్మడి పన్ను రిటర్న్‌లను దాఖలు చేసే ఐచ్ఛిక విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

మార్చి 16న రాజ్యసభలో బడ్జెట్ చర్చ సందర్భంగా రాఘవ్ చద్దా చేసిన ప్రసంగం వైరల్ అవుతోంది. “ఒకే ఇంటి పైకప్పు కింద నివసిస్తారు, ఒకే వంటగదిలో భోజనం చేస్తారు, ఒకే కుటుంబ బడ్జెట్‌ను పంచుకుంటారు.. కానీ పన్ను కట్టే సమయానికి మాత్రం భార్యాభర్తలు ఒకరికొకరు అపరిచితులుగా మారిపోతారు. ఆదాయపు పన్ను వ్యవస్థ కేవలం ఇద్దరు వ్యక్తులను మాత్రమే చూస్తుంది కానీ, ఒక కుటుంబాన్ని చూడదు” అంటూ ఆయన ప్రస్తుత వ్యవస్థలోని లోపాన్ని ఎత్తిచూపారు.

అసమానతను వివరించిన వైనం..

చద్దా తన ప్రతిపాదనను ఒక చక్కని ఉదాహరణతో వివరించారు. రెండు కుటుంబాలను పోల్చి చూపిస్తూ ఆయన చెప్పిన లెక్కలు అందరినీ ఆలోచింపజేశాయి

  • మొదటి కుటుంబం: భార్యాభర్తలిద్దరూ ఒక్కొక్కరు రూ.10 లక్షలు చొప్పున మొత్తం రూ.20 లక్షలు సంపాదిస్తే.. విడివిడిగా మినహాయింపులు పొంది సున్నా పన్ను చెల్లిస్తారు.
  • రెండూ కుటుంబం: ఒకరు మాత్రమే రూ.20 లక్షలు సంపాదిస్తూ, మరొకరు ఇంట్లో ఉండి పిల్లలను చూసుకుంటుంటే.. ఆ కుటుంబం ఏకంగా రూ.1.92 లక్షల పన్ను కట్టాల్సి వస్తోంది.
  • ఆదాయం సమానంగా ఉన్నప్పటికీ, కేవలం సంపాదన పంపిణీలో ఉన్న తేడా వల్ల ఒక కుటుంబంపై ఇంత భారీ భారం పడటం అన్యాయమని ఆయన వాదించారు.

అంతర్జాతీయ ప్రమాణాలు – భారతీయ ఆశలు

అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో వివాహిత జంటలకు ఉమ్మడి ఐటీఆర్ దాఖలు చేసే వెసులుబాటు ఉందని, భారత్‌లో కూడా దీనిని ఐచ్ఛికంగా (Optional) అమలు చేయాలని ఆయన కోరారు. దీనివల్ల సింగిల్-ఇన్‌కమ్ (ఒక్కరే సంపాదించే) కుటుంబాలకు పెద్ద ఎత్తున ఆర్థిక ఊరట లభిస్తుంది. నిపుణుల అంచనా ప్రకారం, 2026 బడ్జెట్‌లో ఇలాంటి కీలక సంస్కరణలు వచ్చే అవకాశం ఉంది.

నిపుణుల మద్దతు..

రాఘవ్ చద్దా ప్రతిపాదనకు ఆర్థిక నిపుణుల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) కూడా ఇలాంటి ప్రతిపాదననే గతంలో చేసిందని సీఏ దిలీప్ సత్భాయ్ వంటి ప్రముఖులు గుర్తు చేస్తున్నారు. ఇది అమలులోకి వస్తే కుటుంబ స్థాయిలో పన్ను మినహాయింపు పరిమితి పెరుగుతుందని, తద్వారా గృహ ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుందని సీఏ సురేష్ సురానా పేర్కొన్నారు. మొత్తానికి చద్దా లేవనెత్తిన ఈ పాయింట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సామాన్య పన్ను చెల్లింపుదారుల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది.





Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related